పార్ట్-38
రమేష్తో పాటు మరో నాయకుడు విరాగి కూడా బయటకు వచ్చాడు. ఎదుటివారి మర్మమెగి మాట్లాడడంలో విరాగి దిట్ట. ముఖంలో ఏ భావమూ వ్యక్తం కాదు. ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. చీమ చిటుక్కుమంటే వినిపించేంత నిశ్శబ్దం.
''కామ్రేడ్స్! పరిస్థితులు మీకు తెలియనివి కావు. జర్నలిస్టు వృత్తి కత్తి మీది సాములాంటిది. కాశ్మీర్లో జర్నలిస్టుగా పని చేయడం ఎంత కష్టమో మనలో చాలా మందిమి చూడకున్నా, అర్థం చేసుకోగలం. ప్రభుత్వాలు ఎంత దమననీతితో వ్యవహరిస్తాయో మనకు తెలియంది. రాజ్యం డెక్కల కింద నలిగి పోయే చీమలెన్నో. ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టు వృత్తి కూడా అంత సులువైందేమీ కాదు. బాధ్యతాయుతమైన వృత్తిలో త్యాగాలు తప్పవు. త్యాగాలకు భయపడేవాడు జర్నలిస్టు కాలేడు''
''సోదంతా ఎందుకు?'' అని అరిచారెవరో గుంపులోంచి. గొంతు గుర్తు పట్టినట్లే ఉన్నాడు విరాగి. ''ఆవేశం పనికి రాదు. ఆలోచన ముఖ్యం. ఆవేశంలో అనర్థాలకు తావు ఉంటుంది. ఆలోచనతో పోతేనే మన పోరాటంలో విజయం సాధించగలుగుతాం. మనం పట్టుబట్టి కూర్చుంటే ప్రభుత్వం మరింత మొండిగా వ్యవహరించవచ్చు'' అన్నాడు.
''తోడుదొంగలు'' అని అరిచారెవరో మళ్లీ. రమేష్ ముఖం కందగడ్డలా తయారైంది. విరాగి ఏ భావమూ కనిపించనీయకుండా నవ్వులు చిందించాడు. ''ఏం చేయాలన్నా వెనకాముందులు ఆలోచించాలి. అడుగు తీసి అడుగు జాగ్రత్తగా వేయాలి. బురదలో కాలు వేస్తే తీసుకోవచ్చు. మాట జారితే వెనక్కి తీసుకోలేం'' అన్నాడు విరాగి తాపీగా.