అరుదైన సాహిత్య వ్యక్తిత్వం
తెలుగు సాహిత్య ప్రపంచంలో ముదిగంటి సుజాతారెడ్డిది బహుముఖ వ్యక్తిత్వం. సాహిత్యంలో ఆమె కవితా ప్రక్రియను మినహా మిగతా అన్ని ప్రక్రియలూ చేపట్టిన సాహిత్య పాఠకుల, విమర్శకుల మన్ననలు పొందారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో చిన్న పిల్లగా ఉన్న సుజాతారెడ్డి ఆనాటి పరిస్థితులను, ఇప్పటి పరిస్థితులను ఆకళింపు చేసుకుని రచనా వ్యాసంగం చేస్తున్నారు. విద్యార్థి దశలో కొన్ని కథలు రాసిన సుజాతారెడ్డి ఆ తర్వా కథలు రాయడం మానేసి కథానిక ప్రక్రియలోకి చాలా ఆలస్యంగా ప్రవేశించారు. మార్క్సిజం తొలినాళ్లలోనే పరిచయమై ఉంటే ముందుగానే తనదైన దృక్పథం ఏర్పడి కథా రచన చేసి ఉండేదాన్నేమోనని ఒకానొక సందర్భంలో అన్నారు. నిజమై కావచ్చు, ఆమె కథలు సమాజాన్ని విస్తృతంగా అధ్యయనం చేశారనడానికి దాఖలాగా కనిపిస్తాయి. విశాలమైన కాన్వాసు ఆమె కథలకు విస్తృతిని కల్పించాయి. సరళమైన శైలి, జీవితం పట్ల స్పష్టమైన అవగాహన ఆమె కథలకు ప్రాణం పోస్తాయి. ఆమె ఇప్పటి వరకు మూడు కథా సంకలనాలు వెలువరించారు. విసుర్రాయి, మింగుతున్న పట్నం, వ్యాపార మృగం ఆమె వెలువరించిన కథా సంకలనాలు. విసుర్రాయిలో స్త్రీల సమస్యలు, ముఖ్యంగా తెలంగాణ స్త్రీల సమస్యలను ప్రతిబింబిస్తూ రాసని కథలు ఉన్నాయి. మింగుతున్న పట్నం సంకలనంలో ఆమె ఆలోచనా స్రవంతి మరింత విస్తరించింది. హైదరాబాదు నగర పరిసరాల్లోని భూమి సమస్యలను, దాని వల్ల తలెత్తుతున్న వివాదాలను, ఇందులో మాఫియా పోషిస్తున్న పాత్రను ఆమె అనితర సాధ్యంగా కథల రూపంలో మన ముందుంచారు. వ్యాపార మృగంలో కూడా ఆమె వస్తు విస్తృతి, శైలీ వైవిధ్యం కనిపిస్తాయి. కథలకు గాను ఆమె చాసో అవార్డును, ఇతర అవార్డులను పొందారు. 1998లో ప్రారంభించిన కథా రచనను ఆమె అసిధారావ్రతంగా కొనసాగిస్తున్నారు.
ఇకపోతే ఆమె నవలా రచన కూడా చేశారు. మలుపు తిరిగిన చక్రాలు నవలలో తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచి ఆంధ్రప్రదేశ్ అవతరణ వరకు తెలంగాణ సమాజ పరిణామక్రమాన్ని చిత్రిక కట్టారు. సంకెళ్లు తెగాయి నవలలో కింది కులం యువకుడు చదువు ద్వారా సమాజంలో ఎదిగి కుల ఫ్యూడల్ సంకెళ్లను తెంచుకున్న వైనాన్ని చిత్రించారు. ఆకాశంలో విభజన రేఖల్లేవు నవల స్త్రీవాద నవల. ర్యాడికల్ ఫెమినిజాన్ని వ్యతిరేకిస్తూ స్త్రీపురుషుల మధ్య సమాన సంబంధాలను ఆకాంక్షిస్తూ రాసిన నవల ఇది. ఆమె నవలలు, కథలు సంప్రదాయానికి, ఆధునికతకు మధ్య ఒక సమన్వయాన్ని సాధించే ప్రయత్నం చేస్తాయి. ఆర్య సమాజ ప్రభావం ఆమెపై ఉంది. జర్మనీలో ఉద్యోగం, లండన్ వంటి ప్రపంచ ప్రసిద్ధ నగరాల సందర్శన ఆమె మానసిక ప్రపంచాన్ని విస్తృతం చేసింది. ఆధునికతకు, సంప్రదాయానికి మధ్య సమన్వయం సాధించిన వ్యక్తిత్వం ఆమెది.
సాహిత్య విమర్శనారంగంలో ఆమె తనదైన ప్రత్యేకతను ప్రదర్శించారు. ప్రాచీన, ఆధునిక సాహిత్యాలను ఆమె విస్తృతంగా అధ్యయనం చేశారు. మను, వసు చరిత్రల తులనాత్మక పరిశీలనం, శ్రీనాధుని కవితా సౌందర్యం, తెలుగు నవలానుశీలనం, వేమన - నాధ సంప్రదాయం అమె వెలువరించిన విమర్శనా గ్రంధాలు. ఆంధ్రుల సంస్కృతి - సాహిత్య చరిత్ర, చారిత్ర సామాజిక నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్ర గ్రంధాలు కూడా రాశారు. భర్త ఆచార్య గోపాలరెడ్డితో కలిసి సంస్కృత సాహిత్య చరిత్ర రాశారు. తెలంగాణ తొలితరం కథలు పుస్తకాన్ని సంకలనం చేసి సంపాదకత్వం వహించారు. సంగిశెట్టి శ్రీనివాస్ తో కలిసి తొలినాటి తెలంగాణ కతలు పుస్తకాన్ని వెలువరించారు. తెలంగాణ సాహిత్య వ్యాసాలతో ముద్దెర పుస్తకాన్ని వెలువరించారు. నెలూ నదీ నాగరికత అనే ఈజిప్టు యాత్రా చరిత్ర పుస్తకాన్ని రాశారు. వ్యాపార సంస్కృతిలో స్త్రీ అనే పుస్తకాన్ని రాశారు. ఇలా ఆమె అనేక రచనలు చేసి వివిధ అవార్డులు కూడా అందుకున్నారు.












Click it and Unblock the Notifications
