దళిత కవిత్వానికి తాత్విక అన్వయం
దళిత కవిత్వాన్ని కేవలం అనుభవాల,ఆత్మన్యూనతా భావాల వ్యక్తీకరణగా కుదింపజూసిన అగ్రకుల సాహితీవేత్తల కుహకత్వాన్ని ప్రశ్నించి ఆర్థికనియతివాద అసమగ్రతనీ బద్దలు కొట్టి తెలుగు సాహిత్యాన్ని కుదుపు కుదిపింది దళిత కవిత్వం. దళితుల బతుకుని అనేక రకాలుగా దిగజారుస్తున్నా కౌటిల్య కులవ్యవస్థ గుట్టుని రట్టు చేసింది.దళితుల ఆశలకి,ఆకాంక్షలకి,ఆవేదనకీ,అక్రోశానికి,ఆగ్రహానికీ,ఆత్మగౌరవానికి ప్రతిరూపంగా నిలిచిన దళిత కవిత్వం కొత్త చూపుతో,కొత్త వ్యక్తీకరణతో బలంగా వస్తోంది.ఈ కోవలో దళిత సాహిత్యంలో బలమైన తాత్విక భూమికను ఏర్పరచిన కవిత్వ సంకలనం "దళిత తాత్వికుడు" డాక్టర్ దార్ల వెంకటేశ్వర రావు వృత్తిరిత్యా హైద్రబాద్ విశ్వవిద్యలయంలో తెలుగు లెక్చరర్.ప్రవృత్తిరిత్యా కవి,విమర్శకుడు.ఇటీవల జాతీయ స్థాయిలో డాక్టర్ అంబేద్కర్ పెలొషిప్ అందుకున్నారు. ఈయన కవిత సంకలనం "దళిత తాత్వికుడు".దళితుని జీవితం ప్రతిరోజు పోరాటమే.గమ్యం మరింత సంక్లిష్టం. అయినా మడమ తిప్పని యోధుని వలె కవిత్వంలోనైన,జీవితంలోనైన రాజీపడని మనస్తత్వం దార్ల గారి సొంతం. ఈ కవితా సంపుటిలో 23 కవితలు ఉన్నాయి. వస్తువురీత్యా, అభివ్యక్తిలో,ఈ కవితలు కొత్త పంథాను తొక్కాయి. రచయిత ఆత్మన్యూనత నుండి ఆత్మగౌరవపోరటానికి ప్రతీకలుగా ఈ కవితలను అభివర్ణించవచ్చు. రచయిత "బడిలో అమ్మ ఒడిలో" అను కవితలో దళితుల ఆత్మగౌరవాన్ని అత్యంత శక్తివంతంగా కవిత్వీకరించాడు. తాను దళితుడు కావడం వల్లనే అందర్ని ప్రేమిస్తున్నానని దళితుల పక్షాన సామూహిక ప్రకటన చేస్తాడు. "ఈ కులంలో పుట్టక పోతే నేను ఇంకోలా ఆలోచించే వాణ్ణేమో ఈ కులంలో పుట్టడమే మంచిదయింది అవమానమంటే అర్థమైంది అందర్ని ప్రేమించిడం తెలిసింది" ప్రాచీన సాహిత్యంలో దళితుల స్థానం చూసి రచయిత ఆగ్రహంగా ఇలా వ్యక్తికరించాడు. "ప్రాచీన సాహిత్యం పాఠమైనప్పుడల్లా నా ముఖకవళికలన్ని మారిపోయేవి... ................ మూకుమ్మడిగా కళ్ళన్నీ నాపైన పోకస్! ఎన్నిసార్లు చంపుతావంటూ దేవున్ని కాలర్ పట్టుకోవలనిపించేది!! కవికి తన పల్లె తాలుకు గతం వెంటాడుతున్నాయి.పురుగుల్ని పాముల్ని లెక్క చేయకుండ,గాయాల చేతులతో పొద్దున్నే కారం పచ్చడి నూరుతున్న "అమ్మ" గుర్తొచ్చి "మావూరు నవ్వింది"కవితలో చక్కగ చిత్రీకరించాడు. "మనం సదుకోకుడదంటే యిన్వెందిరా" భయపెట్టే గ్రామ పెత్తందారీతనం మా యామ్మా బాబుల గొంతుల్లో ఆవేదన జీరకు సజీవ సాక్ష్యాలుగా నాకు కనిపించే మావూరి పాఠశాల,పశుపాకలు ఎవరికైన ఉత్తరం మంచి ప్రేరణ,పదిల పరిచిన గతాల గురుతులు .ఇంటర్నెట్ మాయజాలంలో ఉత్తరాలకు స్థానం లేకుండా పోయింది.ఈ సజీవ వాస్తవాన్ని రచయిత చక్కని శైలిలో వ్యక్తం చేస్తున్నరు. "రోజు ఉత్తరాని కెదురు చూసే చూపులకి పొస్టుమేన్ కైనా తానే ఓ ఉత్తరం రాయాలనిపించదూ....! రోజు ఉత్తరాని కెదురు చూసే నాకు పొస్టుమేన్ నిట్టూర్పులే సజీవ సాక్ష్యం అయినా అబద్దాల్ని అందంగా పేర్చి ఫిరంగి నెప్పుడో హఠాత్తుగా పెల్చేయటమెంత నేరం!" దళిత తాత్వికతని,దళిత సౌదర్యాన్ని "పుట్టు మచ్చ మీదప్రేమ" అను కవితలో భావగర్బితంగా దార్ల వెంకటేశ్వరరావు గారు వెల్లడిస్తున్నరు. "పుట్టుకతో మచ్చ ఒకడిని అందమైన అలంకారంగాను మరొకడికి అసహ్యంగాను మారుతుంది నాకున్న పుట్టుమచ్చలో నా ఎదుటి వాళ్ళకేమి దర్శనమవుతుందో......... వెన్నుపూసపై నిలిచిన సౌందర్య రమణీ నా పుట్టుమచ్చ! నిన్ను నేను ప్రేమిస్తున్నాను!!" - అని దళిత తాత్వికతని లోతైనా ప్రతీకలతో సమర్థంగా అక్షరీకరిస్తున్నారు. గ్లోబలైజెషన్ మోజులో పడి ఇరవైనాలుగ్గంటలు ఇంటర్నెట్,టీవిలకు ప్రస్తుత యువతరం భానిసై పోయింది.పుస్తక ఫఠనం తగ్గిపోయింది.సాహిత్యం అంపశయ్యపై ఉంది.ఈ సమకాలీన వాస్తవాలను రచయిత "కూలుతున్న లైబ్రరి"అను కవితలో ఇలా అంటారు. "అక్షరం ఒకవైపు అన్నం మరోవైపు పెడితే నేను అక్షరాన్నే హత్తుకుంటాను ఆబగా! మా తాత ముత్తాల నుండి మడతలు పడిన ఆ పొట్లల్ని సాగదీసి చూస్తే అంబలైన దొరుకుతుందేమో గాని అక్షరం ముక్కమాత్రం కనబడనివ్వలేదు కదా! అక్షరమంటే అందుకేనేమో నాకంత ఆత్రం! దళితుల సహనశీలతను,ప్రేమించేతత్వాన్ని,ద్వేశించినా, వేదించినా ప్రేమించే తత్వాన్ని "దళిత తాత్వికుడు"కవితలో రచయిత చక్కగా కవిత్వీకరించారు. "ఇప్పటికైన నువ్వెప్పుడైనా అమ్మ తినిపించే గోరుముద్దల రుచిని చూడు మిట్ట మధ్యాహ్నం చేట్టునీడకెల్లి చూడు నీకు ప్రేమించడమే తెలుస్తుంది!!" - అంటూ ప్రేమించేతత్వాన్ని నేర్చుకోవలని ఈ కవిత ద్వార శక్తివంతంగా తెలియజేస్తున్నారు.ఈ విధంగా కవి డాక్టర్ దార్ల వెంకటేశ్వర రావు "దళిత తాత్వికుడు" అను కవిత సంపుటి ద్వార దళితతత్వాన్ని,దళితుల ఆత్మగౌరవాన్ని, దళితుల జీవిత సంఘర్షణ లకు అక్షరరూపం ఇచ్చారు.ప్రతి దళితుడు చదవవలసిన మంచి కవితా సంపుటి ఇది.












Click it and Unblock the Notifications