గురజాడ ఇంటికి రియాల్టీ బెడద
తాను దూరంగా ఉన్న ఇంటి నుంచి వచ్చివెళ్లడానికి ఇబ్బంది అవుతోందని గురజాడ అప్పారావు అప్పట్లో మాహారాజావారికి చెప్పాడు. దాంతో పన్నుల వసూళ్ల ఖానా కోసం నిర్మించిన ఇంటిని గురజాడకు ఇచ్చాడు. ఆ తర్వాత కొత్త ఇల్లు కట్టుకోవాలని గురజాడ మనసు పడి రాజావారికి చెప్పాడు. దాంతో దాని పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని గురజాడకు ఇంటి నిర్మాణం కోసం ఇచ్చాడు. అక్కడే గురజాడ తనకు నచ్చిన రీతిలో ఇల్లు కట్టుకున్నాడు.
అప్పటి మహారాణి లలితాదేవి ఈ ఇంటి నిర్మాణానికి ఎంతో సహకరించింది. నిర్మాణానికి కావాల్సినవాటన్నిటినీ కోట నుంచి తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఆ ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మహారాణి పేరిట 'లలిత్' అని పేరు పెట్టి 1915లో గృహప్రవేశం చేశాడు గురజాడ అప్పారావు. ఆ ఇంటిని తన రచనల భాండాగారంగా మార్చుకోవాలని గురజాడ కలలు కన్నాడు. అందుకు అనుగుణంగానే నిర్మించుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తూ గృహప్రవేశం జరిగిన కొన్నాళ్లకే ఆయన మరణించారు.
గురజాడ మునిమనవడి భార్య సరోజిని తన కొడుకు, కోడలితో ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. అది శిథిలావస్థకు చేరుకుంది. ఆదాయ వనరులు లేకపోవడంతో దాన్ని బాగు చేయించలేకపోయారు. ఆ కారణంగా దాన్ని విక్రయించాలని అనుకుంటున్నారు. అది 80 లక్షల నుంచి కోటి రూపాయలు పలుకుతున్నట్లు వార్తల వచ్చాయి. అయితే, విక్రయం విషయంలో కొంత వ్యతిరేకత ఎదురవుతోంది. ఇంటిని ప్రభుత్వానికి ఇచ్చి, గురజాడ స్మారకంగా ఉండేలా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు.
గృహానికి తగిన వెల చెల్లిస్తేనే ప్రభుత్వానికి విక్రయించడానికి గురజాడ వంశీకులు సిద్ధంగా ఉన్నారు. గురజాడ వంశానికి చెందిన వ్యక్తి అదే జిల్లాకు చెందిన పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను, జిల్లా కలెక్టర్ను కలిసినట్లు సమాచారం. దాన్ని పరిశీలిస్తామని వారు హామీ ఇచ్చినట్లు సమాచారం.