ఆస్పత్రిలో చేరిన మార్క్వెజ్
మెక్సికో: నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ రచయిత గాబ్రియెల్ గార్షియా మార్క్వెజ్ ఆస్పత్రిలో చేరారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఆయన మెక్సికో నగరంలోని ఆస్పత్రిలోచేరారు. ఆయన కోలుకుంటున్నట్లు సమాచారం.
డీహైడ్రేషన్, ఊపరితిత్తుల ఇన్ఫెక్షన్, మూత్రనాళాల ఇన్ఫెక్షన్లతో సోమవారం నుంచి 87 ఏళ్ల మార్క్వెజ్ ఆస్పత్రిలో చేరినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆయన రాసిన వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సోలిట్యూడ్ అనే నవల ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందింది.
చికిత్సకు రచయిత సానుకూలంగా ప్రతిస్పందిస్తున్నారని, యాంటీ బయోటిక్స్ తీసుకోవడం ఆపిన తర్వాత డిశ్చార్జీ చేసే విషయాన్ని పరిశీలిస్తామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మార్క్వెజ్ మెక్సికోలో ఉండబట్టి మూడేళ్లకు పైగా అవుతోంది.
మార్క్వెజ్ న్యుమోనియాతో బాధపడుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన కుమారుడు గొంజాలో గార్షియా బార్చా ఖండించారు. మార్క్వెజ్ త్వరగా కోలుకోవాలని కొలంబియా అధ్యక్షుడు జౌవాన్ మాన్యుయెల్ సంతోస్, మెక్రికో ప్రధాని ఎన్రిక్ పెనా నీటో ఆశించారు. మార్క్వెజ్ కొలంబియా రచయిత.
జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన జర్నలిస్టులను కలవడానికి ఆయన మార్చి 6వ తేదీన మెక్సికో సిటీ ఇంటి నుంచి బయటకు వచ్చారు. అదే ఆయన జనం మధ్య చివరిసారి కనిపించడం. జర్నలిస్టులు ఇచ్చిన బహుమతులను స్వీకరించారు, ఫొటోలకు ఫోజులు ఇచ్చారు గానీ మీడియా ప్రతినిధులతో మాట్లాడలేదు.
కొలంబియాలోని కరేబియన్ తీరంలో గల ఆరకాటకా గ్రామంలో 1927 మార్చి 6వ తేదీన మార్క్వెజ్ జన్మించారు. ఆయన తండ్రి టెలిఫోన్ ఆపరేటర్గా పనిచేసేవారు. ఆయన రాసిన అత్యంత ప్రజాదరణ పొందిన నవల వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సోలిట్యూడ్ 35 భాషల్లోకి అనువాదమైంది. దీని మొదటి ప్రచురణ 1967లో జరిగింది.