భూమికి అల్లంత దూరంలో పింక్ ప్లానెట్- షాకింగ్ ఫైండవుట్..!!
సౌర కుటుంబానికి ఆవల ఉన్న నూతన అంతరిక్ష రహస్యాలను ఛేదించడంలో శాస్త్రవేత్తలు మరో భారీ విజయాన్ని అందుకున్నారు. విశ్వాంతరాల్లో ఓ పింక్ ప్లానెట్ (Pink Planet) ను గుర్తించారు. ఇక్కడి వాతావరణంలో ఊహించని విధంగా ఉప్పు మేఘాలు ఉన్నట్లు నిర్ధారించారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో ఈ అద్భుతమైన ఖగోళ సత్యాన్ని కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ అంతరిక్ష శోధనలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.
ఖగోళ శాస్త్రవేత్తలు దీనికి 'జీజే 504బి' (GJ504b) అని పేరు పెట్టారు. ఇది భూమి నుంచి దాదాపు 57 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సూర్యుడిని పోలిన ఒక నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తోంది. నిజానికి దీనిని మొదటిసారిగా 2013 లోనే గుర్తించినప్పటికీ, అప్పట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏవీ కూడా లభ్యం కాలేదు. ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించిన సమాచారం మొత్తాన్ని కూడా సేకరించారు.

దీనికి సంబంధించిన సమగ్ర పరిశోధనను ది ఆస్ట్రానమికల్ జర్నల్ ప్రచురించింది. మన సౌర కుటుంబంలో అతి పెద్ద గ్రహమైన జుపిటర్ కంటే ఇది దాదాపు 25 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. భూ ఆధారిత అధునాతన టెలిస్కోప్ల ద్వారా ఈ పింక్ ప్లానెట్ ను పర్యవేక్షించడం పరిశోధకులకు చాలా కాలం పాటు ఒక సవాలుగా నిలిచింది. దీని నుంచి వెలువడే అత్యంత బలహీనమైన కాంతి కిరణాల కారణంగా భూమిపై ఉండే టెలిస్కోప్లు స్పష్టంగా ప్రతిబింబించలేకపోయాయి.
దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక పరిశోధక బృందాలు దీనిపై పరిశోధనలు చేయడానికి ప్రయత్నించినప్పటికీ సరైన ఫలితాలను రాబట్టలేకపోయాయి. చివరకు శాస్త్రవేత్తలు ఈ గ్రహాన్ని పరిశీలించడానికి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ను ఉపయోగించారు. అమెరికాలోని నార్త్వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన స్పేస్ రీసెర్చ్ టీమ్ దీన్ని గుర్తించింది. భారత్ కు చెందిన అనీష్ బాబురాజ్ దీనికి నాయకత్వాన్ని వహించారు. గతంలో ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్లతో రాత్రంతా శ్రమించినా సాధించలేని ఫలితాలను జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కేవలం రెండు గంటల వ్యవధిలోనే సాధించిందని ఆయన తెలిపారు.
దీని ద్వారా లభించిన స్పెక్ట్రమ్ సమాచారాన్ని క్షుణ్ణంగా విశ్లేషించినప్పుడు గతంలో ఎన్నడూ చూడని వింతైన వాతావరణ రసాయన పరిస్థితులు తమకు కనిపించాయని అనీష్ వివరించారు. జీజే 504బీ తక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉండటం వల్ల మాత్రమే దీనిని ప్రత్యేకంగా చూడట్లేదు. దీని కాంతి విశ్లేషణను పరిశీలించినప్పుడు అసలు రహస్యం బయటపడింది. సాధారణంగా ఏవైనా మూలకాలు కాంతిని గ్రహించినప్పుడు అవి స్పెక్ట్రమ్పై ప్రతిబింబిస్తాయి.
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సేకరించిన సమాచారం ప్రకారం ఈ వింత గ్రహ వాతావరణంలో నీరు, కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, అమ్మోనియా వంటి రసాయనాలు సమృద్ధిగా ఉన్నట్లు తేలింది. విశ్వంలో ఇప్పటివరకు ఇలాంటి శీతల ఖగోళ వస్తువులపై శాస్త్రవేత్తలు ఊహించిన వాతావరణ నమూనాలు ఏవీ వీటికి సరిపోలలేదు. పరిశోధక బృందం చివరి ప్రయత్నంగా అక్కడ ఉప్పు మేఘాలు కూడా ఉండి ఉంటాయనే అంచనాకు వచ్చింది.
ఈ గులాబీ గ్రహానికి సంబంధించిన మూడు వేర్వేరు రకాల మేఘాల నమూనాలను పరిశీలించగా, ఉప్పు మేఘాల ప్రభావం మాత్రమే జేమ్స్ వెబ్ పంపిన స్పెక్ట్రమ్ డేటాతో సరిపోలింది. వాతావరణంలో లోతుగా పేరుకుపోయిన ఈ ఉప్పు మేఘాలు అక్కడ దాగి ఉన్న ఇతర అణువుల రసాయనాలను కప్పివేసిందనేది స్పష్టమైంది. విశ్వంలో లభించిన ఒక గ్రహం స్పెక్ట్రమ్ను అర్థం చేసుకోవడంలో ఉప్పు మేఘాలు కీలక పాత్ర పోషించడం ఇదే మొదటిసారి.
ఈ అసాధారణ వాతావరణ రసాయన ప్రక్రియలు భవిష్యత్తులో ఇతర సౌర కుటుంబ అవతలి నక్షత్రాలను, వాటి గ్రహాలను అర్థం చేసుకోవడానికి ఒక కొత్త దిక్సూచిగా మారతాయని అనీష్ బాబురాజ్ స్పష్టం చేశారు. సిద్ధాంతాలకు మాత్రమే పరిమితం కాకుండా, భౌతిక రూపంలో ఇలాంటి ఉప్పు మేఘాల ఉనికిని గుర్తించడం ద్వారా ప్రయోగశాలలలో చేసే పరిశోధనలకు కూడా సరికొత్త ఆధారాలు లభించినట్లయింది. ఈ ఆవిష్కరణతో ఖగోళ భౌతిక శాస్త్రంలో సరికొత్త చర్చకు తెరలేచింది.
సాధారణంగా గ్యాస్ జెయింట్ గ్రహాలు పుట్టుకతోనే అత్యంత తీవ్రమైన వేడిని కలిగి ఉంటాయి. కాలం గడిచే కొద్దీ అవి చల్లారుతాయి. జీజే 504బీ వయసు దాదాపు 250 కోట్ల సంవత్సరాల నుండి 400 కోట్ల సంవత్సరాల మధ్య ఉంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. దీని ఉష్ణోగ్రత ప్రస్తుతం 290 డిగ్రీల సెల్సియస్ స్థానానికి పరిమితం కావడం దీనికి ప్రధాన కారణం. ఇదొక డ్వార్ఫ్ ప్లానెట్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు.












Click it and Unblock the Notifications