ఇస్రో ప్రైవేటీకరణపై మాకు సమాధానం కావాలి: కేంద్రానికి సైంటిస్టుల లేఖ
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇస్రోలో మాన్యుఫ్యాక్చరింగ్, ఆపరేషన్ విభాగాలను ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేసే ప్రతిపాదనపై ఉద్యోగులలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయంపై ఓ స్పష్టత ఇవ్వాలని కోరుతోన్నాయి. ఈ మేరకు ఇస్రోకు చెందిన తొమ్మిది ఉద్యోగ సంఘాలు రంగంలోకి దిగదయి. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఛైర్మన్ వీ నారాయణన్కు లేఖ రాశాయి. ఇస్రో, ఉద్యోగుల భవిష్యత్తుపై పలు ప్రశ్నలను లేవనెత్తాయి. కేంద్రానికి కొన్ని సూచనలు సైతం ఇచ్చాయి.
ప్రభుత్వ రంగం కింద కొనసాగుతూనే.. కొన్ని వాణిజ్య కార్యకలాపాలలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని అంగీకరించవచ్చని ఉద్యోగులు పేర్కొన్నారు. స్పేస్ క్రాఫ్ట్ ల తయారీ, లాంచింగ్, గ్రౌండ్ స్టేషన్ కంట్రోల్, ఇతర మౌలిక సదుపాయాల నిర్వహణ వంటి ప్రధాన బాధ్యతలు ప్రభుత్వ చేతుల్లో నుంచి ప్రైవేట్ రంగానికి వెళ్లడం ఎంత మాత్రం కూడా ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు. ఇస్రోను ఓ ఆర్డినరీ ఆర్ అండ్ డీ సంస్థగా మార్చాలనుకోవడం సరికాదని, దీనిపై విస్తృత చర్చ జరగాల్సి ఉందని అన్నారు.

ఇస్రో సైంటిస్టుల ఆందోళనకు కారణాలు లేకపోలేదు. ఆగస్టు 21వ తేదీన ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ చైర్మన్ పవన్ గోయెంకా చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి కారణం అయ్యాయి. భవిష్యత్తులో ఇస్రో శాటిలైట్ వాహక నౌకలను తయారు చేయబోదని, ఆ బాధ్యతలన్నీ ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగ సంస్థలే చూసుకుంటాయని ఆయన పేర్కొన్నారు. అదే ఇప్పుడు ఈ గందరగోళానికి దారి తీసింది.
ఇస్రో సుదీర్ఘకాలంగా అభివృద్ధి చేసిన సాంకేతికత అత్యంత విలువైన జాతీయ ఆస్తి అని ఉద్యోగ సంఘాలు లేఖలో గుర్తు చేశాయి. ఈ టెక్నాలజీని ప్రైవేట్ రంగానికి బదిలీ చేసే ప్రక్రియ పారదర్శకంగా, జవాబుదారీతనంతో కూడి ఉండాలని డిమాండ్ చేశాయి. దేశ వ్యూహాత్మక ప్రయోజనాలు, భద్రత, ఉపాధి అవకాశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఈ సంస్థను ప్రైవేటీకరించడం గానీ, టెక్నాలజీని బదలాయించడం గానీ సరైన పద్ధతి కాదని అభ్యంతరం వ్యక్తం చేశాయి.
సీఎస్ఎల్వీ, ఎల్వీఎమ్ 3, ఎస్ఎస్ఎల్వీ.. వంటి అత్యాధునిక స్పేస్ క్రాఫ్ట్ ల రూపకల్పన, అభివృద్ధి, ప్రయోగ బాధ్యతలు ఇకపై కూడా ఇస్రో ఆధ్వర్యంలోనే సాగుతాయా లేదా అనే ప్రశ్నలకు సమాధానం కావాలని సంఘాలు కోరాయి. ఇస్రోలో శాంక్షన్డ్ పోస్టుల సంఖ్య, ప్రస్తుతం ఖాళీల భర్తీ ప్రక్రియ.. ఈ నిర్ణయం వల్ల ఎలా ప్రభావితమవుతుందో వివరించాలని డిమాండ్ చేశాయి. శాస్త్ర, సాంకేతిక, పరిపాలనా విభాగాలలో కొత్త రిక్రూట్మెంట్ల క్యాలెండర్ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది వివరించాలని తేల్చి చెప్పాయి.
అంతరిక్ష రంగంలో ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్న తరుణంలో, ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఇస్రో ప్రాధాన్యత తగ్గకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, విధానపరమైన ఈ మార్పుల వల్ల సంస్థ పనితీరు మాత్రమే కాకుండా వేలాది మంది ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు, ఉద్యోగుల ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని పేర్కొంది.













Click it and Unblock the Notifications