ఎలాన్ మస్క్కే మస్కా- బిగ్ ఝలక్
Cyberattack on X: అపర కుబేరుడు, ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్కే ఝలక్ ఇచ్చారు కేటుగాళ్లు. ఆయనకు చెందిన టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ఎక్స్పై భారీ సైబర్ దాడికి పాల్పడ్డారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 30 శాతం వరకు దీని
సేవలు స్తంభించిపోయాయి. ఈ దాడిని ఎలాన్ మస్క్ ధృవీకరించారు. దీని వెనుక ఏదైనా ఓ దేశం లేదా గ్రూపులు ఉండొచ్చని తెలిపారు.
తొలుత- డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (డోజ్)పై సైబర్ అటాక్ చోటు చేసుకుంది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోస్టులు పడ్డాయి. అనంతరం టెస్లా సర్వర్లు ఈ సైబర్ అటాక్కు గురి అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా టెస్లా కార్ల స్టోర్లకు సంబంధించిన సమాచారం మొత్తం ఇందులో నిల్వ ఉంటుందని చెబుతున్నారు.

ఆ తరువాత ఎక్స్పై సైబర్ అటాక్ సంభవించింది. ప్రపంచవ్యాప్తంగా యూజర్లు తమ ఎక్స్ అకౌంట్ యాక్సెస్ పొందలేకపోయారు. 30 శాతం నుంచి 40 శాతం వరకు ఎక్స్ యూజర్లు ఇబ్బందులకు పడినట్లు వెబ్సైట్ డౌన్డెటెక్టర్ వెల్లడించింది. దీన్ని గ్లోబల్ అవుట్రెజ్గా ప్రకటించింది.
ఈ దాడిపై వెంటనే స్పందించారు ఎలాన్ మస్క్. ఎక్స్పై భారీ సైబర్ దాడి జరిగిందని నిర్ధారించారు. ఈ తరహా దాడి సర్వ సాధారణమే అయినప్పటికీ- ఇప్పుడు మాత్రం ప్లాన్డ్గా జరిగిందని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి.. ఎక్స్ సెక్యూరిటీని బ్రీచ్ చేసి ఉండొచ్చని అన్నారు.
దీని వెనుక గ్రూపులు లేదా ఏదైనా దేశం ప్రమేయం ఉండొచ్చని ఎలాన్ మస్క్ తెలిపారు. ఈ దాడి ఎలా చోటు చేసుకుందనే విషయంపై ఆరా తీస్తోన్నామని పేర్కొన్నారు. ఎక్స్ యాక్సెస్ పొందలేకపోతున్నానంటూ ఓ యూజర్ చేసిన పోస్ట్కు ఎలాన్ మస్క్ రిప్లై ఇచ్చారు. సైబర్ అటాక్ వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలిపారు.
కొన్ని గంటల పాటు ఎక్స్ సేవలు స్తంభించిపోయాయి. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ అవుట్రెజ్ పతాక స్థాయికి చేరుకుంది. వేల సంఖ్యలో యూజర్లు ఈ అంతరాయం గురించి నివేదించారు. ఆ తరువాత సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7:30 గంటల మధ్య ఈ సంఖ్య భారీగా పెరిగింది. రాత్రి 9 గంటల వరకూ ఇదే పరిస్థితి కొనసాగిందని డౌన్డెటెక్టర్ డేటా తెలిపింది.












Click it and Unblock the Notifications