విశ్వవీధిలో సరికొత్త నగరం, చందమామపై మనిషి కాపురం!
మానవజాతి చరిత్రలోనే అత్యంత అద్భుతమైన, ఊహకందని మహా ప్రయోగానికి అంతరిక్ష పరిశోధనా సంస్థ 'నాసా’ (NASA) శ్రీకారం చుట్టింది. కథల్లో చదువుకున్న చందమామపై ఇక మనుషులు కాపురం పెట్టబోతున్నారు. కేవలం ఒకటి లేదా రెండు పరిశోధనా కేంద్రాలు కాదు.. ఏకంగా వందల చదరపు మైళ్ల విస్తీర్ణంలో, అన్ని వసతులతో కూడిన ఒక 'మెగా చంద్ర నగరాన్ని’ (Moon Base) నిర్మించేందుకు అమెరికా బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది. రాబోయే పదేళ్లలోపు సిబ్బందితో కూడిన శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా నాసా అడుగులు వేస్తోంది.
మంగళవారం వాషింగ్టన్ డీసీ లోని నాసా ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో 'మూన్ బేస్’ ప్రోగ్రామ్ మేనేజర్ కార్లోస్ గార్సియా-గలాన్ ఈ వివరాలను వెల్లడించారు. "చంద్రుడిపై శాశ్వత మానవ ఉనికిని స్థాపించడమే మా అంతిమ లక్ష్యం. ఇందుకోసం వందల చదరపు మైళ్ల విస్తీర్ణంలో మౌలిక సదుపాయాలను, విభిన్న రకాల ఆస్తులను సమకూర్చుకోబోతున్నాం" అని ఆయన ప్రకటించారు.
మూడు దశల్లో 'చంద్ర నగరం’ నిర్మాణం
నాసా రోడ్మ్యాప్ ప్రకారం.. 2026 నుండి 2032 వరకు మూడు ప్రధాన దశల్లో ఈ చంద్ర స్థావర నిర్మాణం జరగనుంది:
- మొదటి దశ (ప్రస్తుతం నుండి 2029): చంద్రుడి ఉపరితలానికి సురక్షితమైన, నమ్మదగిన ప్రవేశాన్ని నిర్ధారించుకోవడం, ప్రాథమిక సమాచారాన్ని సేకరించడం.
- రెండవ దశ (2029 నుండి 2032): స్థావరం యొక్క ప్రారంభ ఆపరేటింగ్ సామర్థ్యాన్ని (Initial Operating Capability) పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం.
- మూడవ దశ (2032 తర్వాత): చంద్రుడిపై "అర్ధ-శాశ్వత సిబ్బంది ఉనికి" (Semi-permanent crew presence) సాధించడం ద్వారా మానవ నివాసాన్ని సుస్థిరం చేయడం.

దక్షిణ ధ్రువమే ఎందుకంటే..?
ఈ భారీ నగరాన్ని చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో నిర్మించనున్నారు. బిలియన్ల సంవత్సరాలుగా సూర్యకాంతి పడకుండా శాశ్వత నీడలో ఉన్న బిలాల (Craters) అడుగు భాగంలో భారీగా 'నీటి మంచు’ నిల్వలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భవిష్యత్తులో మానవ మనుగడకు, రాకెట్ ఇంధన తయారీకి ఈ నీరే అత్యంత కీలకం కానుంది. అయితే, ఇక్కడి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా అన్ని వసతులు ఒకే చోట నిర్మించడం సాధ్యం కాదని నాసా ప్రధాన ఆర్కిటెక్ట్ నుజుద్ మెరాన్సీ తెలిపారు. సూర్యకాంతి లభించే కొండ శిఖరాలపై మానవ ఆవాసాలు ఉంటే, వాటి రేడియేషన్ రక్షణ కోసం అణు విద్యుత్ వ్యవస్థలను కిలోమీటరు దూరంలో నిర్మిస్తారు. వీటన్నింటినీ కలిపినప్పుడు ఇది ఒక పెద్ద నగరంగా విస్తరించనుంది.
రంగంలోకి 'మూన్ఫాల్ డ్రోన్లు’.. కోట్లలో కాంట్రాక్టులు
దక్షిణ ధ్రువంలోని అనిశ్చితిని అధిగమించడానికి నాసా 'మూన్ఫాల్ డ్రోన్లను' రోబోట్లను రంగంలోకి దించుతోంది. మొదటి బృందం డ్రోన్లను 2028లో 'ఫైర్ఫ్లై ఏరోస్పేస్’ ల్యాండర్ ద్వారా ప్రయోగించనున్నారు. ఇందుకోసం ఆ సంస్థకు 7.5 కోట్ల డాలర్ల కాంట్రాక్టు లభించింది. ఇవి చంద్ర స్థావరం యొక్క సరిహద్దులను (కీప్-అవుట్ జోన్లు) గుర్తించడంలో సహాయపడతాయి.
National Aeronautics and Space Administration (#NASA) releases details of #robotic landers, hopping drones and vehicles it aims to send to #Moon as part of US plans to build a #lunar base.
— All India Radio News (@airnewsalerts) May 27, 2026
NASA is facing competition from China which is forging ahead with its own plans to land… pic.twitter.com/JIPhWFC6Xm
దీనితో పాటు వ్యోమగాములు ప్రయాణించడానికి సెల్ఫ్ డ్రైవ్ చంద్ర వాతావరణ వాహనాల (LTV) తయారీ కోసం 'ఆస్ట్రోలాబ్’కు 21.9 కోట్ల డాలర్లు, 'లూనార్ ఔట్పోస్ట్’కు 22 కోట్ల డాలర్ల నిధులను నాసా కేటాయించింది. ఆర్టెమిస్-4 మిషన్ (2028) ల్యాండ్ అవ్వడానికి ముందే కనీసం ఒక రోవర్ అక్కడ సిద్ధంగా ఉంటుంది. వీటిని జెఫ్ బెజోస్కు చెందిన 'బ్లూ ఆరిజిన్’ సంస్థ నిర్మించే 'బ్లూ మూన్ ల్యాండర్’ ద్వారా చంద్రుడిపైకి చేరవేస్తారు.
డ్రాగన్కు చెక్.. అమెరికా ఆధిపత్యం!
మరోవైపు చైనా సైతం 2030 నాటికి చంద్రుడిపై వ్యోమగాములను దించి, స్థావరాన్ని నిర్మించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో చైనా కంటే ముందే అక్కడ అడుగుపెట్టడం అమెరికాకు అత్యంత వ్యూహాత్మక అవసరమని నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్మాన్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ 'ఔటర్ స్పేస్ ట్రీటీ’ నిబంధనలను గౌరవిస్తూనే, అక్కడ బాధ్యతాయుతమైన ప్రవర్తనకు అమెరికానే మార్గదర్శకాలను నిర్దేశిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికే ఆర్టెమిస్-1, ఆర్టెమిస్-2 మిషన్లను నాసా విజయవంతం చేసింది. వచ్చే ఏడాది (2027) మధ్యలో 'ఆర్టెమిస్-3’ ద్వారా స్పేస్ఎక్స్ స్టార్షిప్, ఒరియన్ క్యాప్సూల్ ల డాకింగ్ పరీక్షను నిర్వహించనున్నారు. "మరొక ఖగోళ ప్రపంచంలో మానవాళి నిర్మించబోయే మొదటి అవుట్పోస్ట్ ఇదే. అత్యంత కఠినమైన వాతావరణంలో జీవించడానికి ఇది ఒక గొప్ప అభ్యాస అవకాశం" అని ఐజాక్మాన్ ధీమా వ్యక్తం చేశారు.














Click it and Unblock the Notifications