పసిఫిక్ మహాసముద్రం మీదుగా శరవేగంగా 'సూపర్ ఎల్ నినో: ట్రాక్ చేసిన నాసా
పసిఫిక్ మహాసముద్రంలో చోటుచేసుకుంటున్న భారీ మార్పులు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవేత్తలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సుమారు 14,500 కిలోమీటర్ల మేర విస్తరించిన ఒక భారీ ఎల్ నినో కెల్విన్ వేవ్ పసిఫిక్ మీదుగా వేగంగా కదులుతున్నట్లు నాసాకు చెందిన అత్యాధునిక సెంటినెల్-6 శాటిలైట్ గుర్తించింది. ఈ అసాధారణ పరిణామం కారణంగా సముద్ర ఉపరితలం సాధారణ స్థాయి కంటే దాదాపు 15 సెంటీమీటర్ల మేర పైకి లేవడం గమనార్హం.
అమెరికా వాతావరణ సంస్థ నోవా ఇప్పటికే పసిఫిక్ సముద్రంలో ఎల్నినో పరిస్థితులు ఏర్పడినట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. రాబోయే శీతాకాలం నాటికి ఇది అత్యంత బలమైన సూపర్ ఎల్ నినోగా రూపాంతరం చెందడానికి 63 శాతం అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 1997, 2015 సంవత్సరాల్లో సంభవించిన తీవ్రమైన వాతావరణ పరిస్థితుల తరహాలోనే ఈసారి కూడా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే ప్రమాదం పొంచి ఉంది.

పసిఫిక్ సముద్రంలో తూర్పు నుండి పడమర వైపు వీచే పవనాలు బలహీనపడినప్పుడు, ఇండోనేషియా తీర ప్రాంతంలోని వేడి నీరు తిరిగి తూర్పు వైపునకు ప్రయాణిస్తుంది. ఈ ప్రక్రియనే 'కెల్విన్ వేవ్' (Kelvin Wave) అని పిలుస్తారు. ఈ వేడి నీటి ప్రవాహాలు సముద్రపు లోతుల్లో ఉండే చల్లటి నీరు పైకి రాకుండా అడ్డుకోవడం వల్ల తూర్పు పసిఫిక్ ప్రాంతంలో సముద్ర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
నాసా సెంటినెల్-6 ఉపగ్రహం అందించిన సమాచారం
నాసా, దాని యూరోపియన్ భాగస్వామ్యంతో పనిచేస్తున్న 'సెంటినెల్-6 మైఖేల్ ఫ్రీలిచ్' ఉపగ్రహం ప్రతి 10 రోజులకు ఒకసారి భూమిపై ఉన్న సముద్రాల ఎత్తును అత్యంత ఖచ్చితత్వంతో లెక్కిస్తుంది. ఈ రాడార్ వ్యవస్థ సేకరించిన సమాచారం ప్రకారం, మైక్రోనేషియా సమీపంలో బలమైన కెల్విన్ అలలు తూర్పు వైపు ప్రయాణించాయి. ఆ తర్వాత పెరూ దేశ తీరప్రాంతాన్ని చేరుకుని, అక్కడ సముద్ర మట్టాన్ని సాధారణ సగటు కంటే గణనీయంగా పెంచాయి.
ఎల్ నినో ముప్పు పసిఫిక్ దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని మార్చివేస్తుంది. భారత్ కు వెన్నెముక లాంటి నైరుతి రుతుపవనాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. సాధారణంగా శక్తిమంతమైన ఎల్నినో ఏర్పడిన సంవత్సరాలలో భారత్ లో వర్షపాతం పడిపోవడమే కాకుండా కరువు పరిస్థితులు తలెత్తాయి. ఈ సారి కూడా దేశంలో పంటల దిగుబడిపై కూడా ఇది గట్టి దెబ్బ కొట్టే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.
ఇండియన్ ఓషన్ డైపోల్ ఆశలు
ఈ వాతావరణ ముప్పు నుండి భారత్ ను రక్షించడానికి 'ఇండియన్ ఓషన్ డైపోల్' (IOD) అని పిలిచే వాతావరణ పరిస్థితి ఉపయోగపడవచ్చు. ఒకవేళ హిందూ మహాసముద్రంలో అనుకూల పరిస్థితులు ఏర్పడితే, అది ఎల్ నినో కలిగించే భారీ నష్టాన్ని కొంతవరకు నివారించగలదు. ఏదేమైనప్పటికీ పసిఫిక్ మహాసముద్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భారత్తో పాటు ఆసియా దేశాల జలవనరులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది.












Click it and Unblock the Notifications