రైతులకు గుడ్ న్యూస్.. వర్షాల్లేకపోయినా ఈ వరి రకం తట్టుకుంటుంది!
ప్రపంచ జనాభాలో దాదాపు సగం మందికి వరి అన్నమే పరమాన్నం. అయితే, మారుతున్న వాతావరణ పరిస్థితులు, తీవ్ర వర్షభావం, కరవు ముప్పు వరి సాగును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. సాధారణంగా వరి పంట పండించడానికి భారీగా నీరు అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో, అతి తక్కువ నీటితో, కరవు పరిస్థితులను సైతం తట్టుకుని నిలబడే సరికొత్త వరి రకాలను రూపొందించే దిశగా అంతర్జాతీయ శాస్త్రవేత్తలు సరికొత్త మైలురాయిని అధిగమించారు. ముఖ్యంగా చైనా, బ్రిటన్ శాస్త్రవేత్తల పరిశోధనలు ఇప్పుడు ప్రపంచ వ్యవసాయ రంగానికి కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి.
చైనాకు చెందిన హువాజోంగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, బీజీఐ-రీసెర్చ్, యునాన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సంయుక్తంగా వరి మొక్కలపై లోతైన అధ్యయనం చేశారు. సుమారు 16 రకాల (సగం మెట్ట, సగం నీటిపారుదల) వరి వంగడాల వేర్లు, వాటి జన్యు నిర్మాణాన్ని పరిశీలించారు. వేర్ల ఎదుగుదలకు కారణమయ్యే 376 జన్యువులను విశ్లేషించిన తరుణంలో.. 'హెచ్ఎంజీబీ1' (HMGB1) అనే కీలక జన్యువును వారు గుర్తించారు.

ఈ జన్యువు ప్రత్యేకత ఏమిటంటే, ఇది వేర్లు నిటారుగా భూమి లోపలికి చొచ్చుకుపోకుండా ఒక 'బ్రేక్'లా పనిచేస్తుంది. దీనివల్ల వేర్లు పొడవుగా కాకుండా, ఉన్నచోటే మందంగా, బలంగా తయారవుతాయి. పొడి వాతావరణంలో, నీటి ఎద్దడి ఉన్నప్పుడు కూడా మొక్క స్థిరంగా నిలబడేలా ఈ మందపాటి వేర్లు దోహదపడతాయి. సాంప్రదాయ పద్ధతుల్లో యాదృచ్ఛికంగా సంకరణం (Crossbreeding) చేసే అవసరం లేకుండా, నేరుగా ఈ జన్యువును లక్ష్యంగా చేసుకుని తక్కువ నీటితో పండే వరి రకాలను వేగంగా సృష్టించవచ్చని 'సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్' వెల్లడించింది.
గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీకి భరోసా
ప్రపంచవ్యాప్తంగా సాగవుతున్న వరిలో దాదాపు 75 శాతం పంట నీటిపారుదలపైనే ఆధారపడి ఉంది. చైనాలోనైతే వ్యవసాయానికి వాడే నీటిలో 70 శాతం వరికే పోస్తారు. అటు ఫిలిప్పీన్స్, వియetnam, థాయ్లాండ్ వంటి దేశాలు నీటి సరఫరా కోసం భారీగా ఖర్చు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చైనా శాస్త్రవేత్తల ఆవిష్కరణ ప్రపంచ ఆహార భద్రతకు పెద్ద ఊరటనివ్వనుంది.
మరోవైపు బ్రిటన్లోని నాటింగ్హామ్ విశ్వవిద్యాలయం కూడా ఈ దిశగా ముమ్మర పరిశోధనలు చేస్తోంది. అక్కడి హాన్స్ఫీల్డ్ ఫెసిలిటీలో అత్యాధునిక 'మైక్రో-సీటీ స్కానర్' సహాయంతో వరి మొక్కల వేర్లను స్కానింగ్ చేస్తున్నారు. వాతావరణ మార్పుల ఒత్తిడిని వేర్లు ఎలా తట్టుకుంటున్నాయో గమనించి, లోతుగా వెళ్లి నీటిని గ్రహించేలా చేసే జన్యువులపై వారు దృష్టి సారించారు. ఈ రెండు దేశాల పరిశోధనలు విజయవంతమైతే, రాబోయే రోజుల్లో నీటి కొరత ఉన్నా సరే.. ధాన్యపు రాశులు పండటం ఖాయంగా కనిపిస్తోంది.














Click it and Unblock the Notifications