భూమిని సమీపించిన గ్రహ శకలం: హిందూ మహాసముద్రంపై చివరి నిమిషంలో.. !!
అంతరిక్షం నుంచి దూసుకొచ్చిన ఓ చిన్న గ్రహశకలం హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించింది. భూ వాతావరణంలోకి ప్రవేశించింది. ఈ హఠాత్ పరిణామం అంతరిక్ష శాస్త్రవేత్తలను ఉలిక్కిపడేలా చేసింది. సీఈఆర్ఎన్ క్యూ52 అనే ఈ గ్రహశకలం భూమిని తాకకముందే ఆస్ట్రేలియా వాయువ్య తీర ప్రాంతానికి ఉత్తర దిశగా సముద్రం గగనతలంపై విచ్ఛిన్నమైంది. ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా ఓ ఉల్కాపాతంలా దాని ప్రయాణం ముగిసిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఈ అస్టరాయిడ్ విస్తీర్ణం ఓ మీటర్ కంటే తక్కువ పరిమాణంలో ఉన్నట్లు అమెరికా అరిజోనాలో గల మౌంట్ లెమ్మన్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీని కదలికలను కేటాలినా స్కై సర్వే ద్వారా గుర్తించారు. ఈ శకలం పరిమాణం 0.6 నుంచి 1.2 మీటర్ల మధ్య ఉండొచ్చని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీఅంచనా వేసింది. ఈ నెల 6వ తేదీన యూటీసీ కాలమానం ప్రకారం సాయంత్రం 4.12 నిమిషాలకు ఈ గ్రహశకలం భూమిని సమీపించింది.

దీని గమనం వెనుక ఉన్న ప్రత్యేకత.. దాని ప్రయాణం వేగం. భూమిని తాకడానికి కొన్ని గంటల ముందే పరిశోధకులు దీని ఉనికిని కనిపెట్టారు. అప్పటివరకు కూడా ఇలాంటి ఓ చిన్న గ్రహశకలం ఉందనే విషయాన్ని ముందుగా పసిగట్టలేకపోయారు. దాని పరిమాణం, వేగం వల్ల ముందుగా గుర్తించలేకపోయినట్లు అబ్జర్వేటరీ తెలిపింది. ఇంత తక్కువ వ్యవధిలో గ్రహశకలాన్ని గుర్తించి, దాని కక్ష్యను విశ్లేషించడం గ్లోబల్ ప్లానెటరీ డిఫెన్స్ సిస్టమ్స్కు ఓ అనుభవంగా మారింది.
ఇలాంటి చిన్న గ్రహశకలాల వల్ల భూమిపై ఉన్న జీవకోటికి ఎలాంటి ముప్పు ఉండదని నాసా శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. సాధారణంగా 25 మీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉండే అంతరిక్ష శిలలు భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు ఏర్పడే విపరీతమైన ఘర్షణ వేడికి పూర్తిగా కాలిపోయి బూడిదవుతాయి. సీఈఆర్ఎన్ అస్టరాయిడ్ పరిమాణం చాలా చిన్నది కావడం వల్ల అది భూ వాతావరణంలో ఓ ఉల్కలా మెరిసి అంతర్థానమైపోయింది.
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ.. నాసాకు చెందిన స్మార్ట్ స్కౌట్ సిస్టమ్ ఇలాంటి అస్టరాయిడ్స్ కదలికలు, వాటి ప్రయాణ మార్గాలను నిరంతరం గమనిస్తూనే ఉంటుంది. అంతరిక్ష పరిశోధనల చరిత్రలో భూ వాతావరణంలోకి ప్రవేశించడానికి కొద్ది గంటల ముందే గుర్తించిన గ్రహశకలాల్లో ఇది 13వది మాత్రమే. సాధారణంగా ఇలాంటి చిన్న ఖగోళ శకలాలు మన కంటికి చిక్కకుండానే భూమిని దాటిపోతుంటాయి. అంతర్జాతీయ అంతరిక్ష నెట్వర్క్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు సమన్వయంతో పనిచేసి దీని గమనాన్ని కచ్చితంగా లెక్కగట్టగలిగారు.
ఈ రోదసి శిల అత్యంత అరుదైన అటెన్ రకానికి చెందినది కావొచ్చని ఖగోళ నిపుణులు ప్రాథమికంగా నిర్ధారించారు. సాధారణంగా భూమికి సమీపంగా వచ్చే అపోలో రకం గ్రహశకలాల కంటే ఇవి చాలా భిన్నమైనవి. ఇవి సూర్యుడికి అత్యంత సమీపంగా ఉండే కక్ష్యలో ప్రయాణిస్తూ భూమి గమనాన్ని దాటుతుంటాయి. ఈ గ్రహశకలం కదలికలను అధ్యయనం చేయడం ద్వారా మన సౌర కుటుంబంలోని అంతర్గత కక్ష్యల గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడవుతాయి.















Click it and Unblock the Notifications
