చాహల్ vs బీసీసీఐ... ఏం జరుగుతోంది..?
క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ ఐసీసీ టోర్నీ కోసం టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలోనే టీమ్ ఇండియా జట్టు బరిలోకి దిగుతోంది. అయితే ఈ టోర్నీలో స్టార్ పేసర్ షమీ బరిలోకి దిగుతున్నాడు. స్పిన్నర్ కుల్ దీప్ యాదవ్ కూ చోటు దక్కింది.
అయితే ఇప్పుడు క్రికెట్ అభిమానులందరినీ ఒకే ప్రశ్న వెంటాడుతోంది. ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన యుజ్వేంద్ర చాహల్ ను ఎందుకు పక్కన పెట్టారో అని. కీలకమైన మ్యాచ్ ల్లో తనదైన శైలిలో బౌలింగ్ చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన చాహల్ ను మేనేజ్ మెంట్ పట్టించుకోకపోవడంపై క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

చాహల్ కెరీర్ ముగిసినట్లే..
ఇదే విషయంపై టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అసహనం వ్యక్తం చేశాడు. బీసీసీఐ చాహల్ కెరీర్ ముగిసేలా చేసిందని మండిపడ్డాడు. గత రెండేళ్ల నుంచి అతడిని జట్టులోకి తీసుకోకపోవడం చూస్తుంటే తనకు ఆశ్చర్యంగా అనిపిస్తోందన్నాడు.
"యుజ్వేంద్ర చాహల్ కెరీర్ దాదాపు ముగిసిపోయింది. బీసీసీఐ అతడి ఫైల్ను క్లోజ్ చేసింది. ఎందుకు ఇలా జరిగిందనేది అర్థం చేసుకోవడమూ కష్టమే. అతడు చివరిసారిగా 2023 జనవరిలో వన్డే మ్యాచ్ ఆడాడు. దాదాపు రెండేళ్లవుతోంది. అతడి రికార్డ్స్ బాగున్నాయి. నిలకడగా వికెట్లు తీస్తూనే ఉన్నాడు. కానీ, అప్పట్నుంచి అతడికి అవకాశాలు మాత్రం ఇవ్వలేదు" అని చోప్రా తెలిపాడు.
చాహల్ రికార్డ్స్ ఇవే..
ఇక చాహల్ మొత్తం 72 వన్డేల్లో 121 వికెట్లు పడగొట్టాడు. చాహల్ ఎకానమీ రేటు 5.26గా ఉంది. టీ20ల్లో 96 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో అతని ఎకానమీ రేటు 8.19గా ఉంది. ఇక ఐపీఎల్ లో 160 మ్యాచ్ లు ఆడి 205 వికెట్లతో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. 2025 ఐపీఎల్ వేలంపాటలో పంజాబ్ కింగ్స్ చాహల్ ను 18కోట్లకు దక్కించుకుంది.
ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. మార్చి 9 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఈ టోర్నోలో భారత్ సహా 8 దేశాలు పాల్గొంటున్నాయి. పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు ఉన్నాయి. భారత్ ఆడబోయే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరగనున్నాయి. మిగిలినవి- కరాచీ, లాహోర్, రావల్పిండిల్లో షెడ్యూల్ అయ్యాయి.












Click it and Unblock the Notifications