ముదిరిన ముస్తాఫిజుర్ వ్యవహారం: భారత్ లో భద్రత లేదంటూ..!!
బీసీసీఐ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను తక్షణమే జట్టు నుంచి తప్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్కతా నైట్ రైడర్స్ (KKR)ను సూచించింది. దీనికి గల కారణాలను సమగ్రంగా వెల్లడించలేదు గానీ- "తాజా పరిణామాల" వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను జట్టులోకి తీసుకోవడం పట్ల నెలకొన్న వివాదం నేపథ్యంలో బీసీసీఐ ఈ చర్య తీసుకున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా చెప్పారు.
దీన్ని బంగ్లాదేశ్ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. టీ20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని డిమాండ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును ఆదేశించిందక్కడి ప్రభుత్వం. ముస్తాఫిజుర్ తొలగింపు తర్వాత భారత్ లో తమ దేశ ఆటగాళ్ల భద్రత పట్ల ఆందోళనలు పెరిగినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ లో తమ ప్లేయర్లకు భద్రత ఉండదని పేర్కొంది.

టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లను భారత్ నుండి శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి లేఖ రాయాలని నిర్ణయించింది. ఐపీఎల్ ప్రసారాలను కూడా నిలిపివేయాలని ఆయన బంగ్లాదేశ్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను కోరారు. ఫిబ్రవరి-మార్చిలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ లో నాలుగు మ్యాచ్ లను ఆడాల్సి ఉంది బంగ్లాదేశ్. వీటన్నింటినీ కూడా శ్రీలంకకు తరలించాలని ఐసీసీని కోరబోతోంది బంగ్లా క్రికెట్ బోర్డ్. ఈ నేపథ్యంలో బీసీబీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ శనివారం అత్యవసర జూమ్ సమావేశం నిర్వహించింది.
ప్రస్తుత పరిణామాల దృష్ట్యా, ఐసీసీకి తమ ఆందోళనలను తెలియజేస్తామని మీడియా కమిటీ ఛైర్మన్ అమ్జాద్ హుస్సేన్ తెలిపారు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ను జట్టు నుంచి తొలగించాలని కేకేఆర్ను ఆదేశించడాన్ని క్రీడా మంత్రిత్వ శాఖ సలహాదారు నజ్రూల్ తప్పుపట్టారు. దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. క్రీడా మంత్రిత్వ శాఖ సలహాదారుగా, ఈ మొత్తం విషయంపై ఐసీసీకి స్పష్టత ఇవ్వమని బీసీబీని కోరానని తెలిపారు
ఓ ఐపీఎల్ ఫ్రాంఛైజీతో ఒప్పందం ఉన్నప్పటికీ తమ దేశ క్రికెటర్ భారత్లో ఆడలేకపోతే దానికి అర్థం లేదని అన్నారు. ప్రపంచ కప్ వంటి పెద్ద టోర్నమెంట్లో తమ దేశ జట్టుకు భద్రత ఉంటుందనుకోవట్లేదని నజ్రూల్ పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రపంచ కప్ మ్యాచ్లను శ్రీలంకలో నిర్వహించాలని కోరుతూ బీసీబీకి ఆదేశాలు జారీ చేసినట్లు నజ్రూల్ తెలిపారు. బంగ్లాదేశ్కు సంబంధించిన ఐపీఎల్ మ్యాచ్ల ప్రసారంపై నిషేధం విధించాలని సమాచార, ప్రసార సలహాదారును కూడా కోరారు.












Click it and Unblock the Notifications