రేపు.. బీసీసీఐ కీలక భేటీ: టీమిండియాలో భారీ మార్పులకు ఛాన్స్: వీవీఎస్ కూ పిలుపు
భారత క్రికెట్ భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి బీసీసీఐ గురువారం ఓ కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ ఏర్పాటైంది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్.. దీనికి హాజరు కానున్నారు. అదే సమయంలో బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ కు కూడా పిలుపు అందడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో భారత్ ఎదుర్కొన్న పరాజయాలతో పాటు ఆటగాళ్ల ఫిట్నెస్ సమస్యలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనుంది బీసీసీఐ. ఈ రెండు దేశాల్లో టీమిండియా అట్టర్ ఫ్లాప్ షో కనపరిచిన విషయం తెలిసిందే. ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో 2-0తో ఓడిపోయింది. ఫలితంగా మూడేళ్లపాటు నిరాటంకంగా కొనసాగిన 16 సిరీస్ల అజేయ ప్రస్థానానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత జరిగిన ఇంగ్లాండ్ పర్యటనలోనూ అదే పరిస్థితి. టీ20 సిరీస్ను 4-0, వన్డే సిరీస్ను 2-1తో చేజార్చుకుంది.

ఈ పరాజయాలపై బోర్డు సెలక్టర్లతో కలిసి విశ్లేషించనుంది. దీంతో పాటు 2027 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకుని రోడ్మ్యాప్ను కూడా ఈ సందర్భంగా ఖరారు చేయనుంది. ప్రస్తుతం టీమిండియాలో గాయాలు, వారి రిహాబిలిటేషన్ ప్రక్రియ తలనొప్పిగా మారింది. కీలక మ్యాచ్ల కంటే ముందే ఆటగాళ్లు గాయాల బారిన పడటంపై బీసీసీఐ అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్వహణతో పాటు ప్లేయర్లు, సెలక్షన్ కమిటీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉందనే నిర్ధారణకు వచ్చింది.
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ప్లేయర్ల ఫిట్నెస్కు సంబంధించి సెలెక్షన్ కమిటీకి సమగ్ర సమాచారం అందకపోవడం వల్లే జట్టు ఎంపికలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు భావిస్తోంది. స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా మోకాలి గాయం తీవ్రతరం కావడంతో శ్రీలంక పర్యటనకు దూరం అయ్యాడు. ఈ విషయం సెలక్షన్ కమిటీకి ముందే తెలియకపోవడం వల్ల అతన్ని ఆ సిరీస్ కు ఎంపిక చేశారు కూడా. ఆ తర్వాత రీప్లేస్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది.
ఇప్పటికే గాయాలబారిన పడ్డ హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, సాయి సుదర్శన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా కోలుకోవడానికి ఆశించిన దానికంటే ఎక్కువ సమయం పడుతోంది. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కోసం జట్టును ఎంపిక చేసినప్పటికీ.. నలుగురు ఆటగాళ్ల ఫిట్నెస్ ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. బుమ్రా, వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డి, హర్షిత్ రాణా ఈ నెల 9న ఫిట్నెస్ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది.
ఈ సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశాలు లేకపోలేదు. టీ20 ఫార్మట్ కోసం వీవీఎస్ లక్ష్మణ్ ను హెడ్ కోచ్ గా అపాయింట్ చేయవచ్చని తెలుస్తోంది. జింబాబ్వే సిరీస్ కు లక్ష్మణే హెడ్ కోచ్ వ్యవహరించాడు. ఆ సిరీస్ ను టీమిండియా 3-0 తేడాతో గెలుచుకుంది కూడా. ఆయా అంశాలన్నింటినీ క్షుణ్నంగా చర్చించబోతోంది బీసీసీఐ. అదే సమయంలో ఐపీఎల్ వర్క్లోడ్ విషయం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశాలు లేకపోలేదు.













Click it and Unblock the Notifications