ఇంగ్లాండ్ తో ఓటమి వేళ.. తెరపై ఆ లెజెండ్స్- బీసీసీఐ
ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత్ మరో ఓటమిని మూటగట్టుకుంది. గెలిచాల్సిన మ్యాచ్ ఓడిపోయింది. చేతుల దాకా వచ్చిన మ్యాచ్ ను నోటి దాకా తీసుకెళ్లడంలో ఘోరంగా విఫలమైంది. మూడో టెస్ట్ మ్యాచ్ లో 22 పరుగుల తేడాతో మట్టికరిచింది. అయిదు మ్యాచ్ ల సిరీస్ లో 2-1 తేడాతో వెనుకంజలో నిలిచింది.
లార్డ్స్ లో జరిగిన మూడో టెస్ట్ లో విజయానికి అవసరమైన 192 పరుగులను అందుకోవడంలో విఫలమైంది టీమిండియా. 170 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్ లో సత్తా చాటిన బ్యాటర్లందరూ రెండో ఇన్నింగ్ లో చేతులెత్తేశారు. నిర్లక్ష్యపు ఆటతీరును ప్రదర్శించారు. ఓటమిని కొని తెచ్చుకున్నారు.

యశస్వి జైస్వాల్- 0, కేఎల్ రాహుల్- 39, కరుణ్ నాయర్- 14, శుభ్ మన్ గిల్- 6, ఆకాష్ దీప్- 1, రిషభ్ పంత్- 9, వాషింగ్టన్ సుందర్- 0, నితీష్ కుమార్ రెడ్డి- 13, జస్ ప్రీత్ బుమ్రా- 5, మహ్మద్ సిరాజ్- 4 పరుగుుల చేశారు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఒక్కడే పోరాట పటిమ ప్రదర్శించాడు. 61 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
ఈ పరిస్థితుల మధ్య నాలుగో టెస్ట్ ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది భారత్. ఈ మ్యాచ్ ఈ నెల 23వ తేదీన ఆరంభం కానుంది. మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియం దీనికి వేదిక. ఇందులో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది టీమిండియా. దీనికోసం తుదిజట్టులో భారీ మార్పులు చేయనుంది.
ఈ పరిణామాల మధ్య భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) ఉపాధ్యక్షడు రాజీవ్ శుక్లా తెరమీదికి వచ్చారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల టెస్ట్ రిటైర్మెంట్పై స్పష్టత ఇచ్చారు. ఈ విషయంలో బీసీసీఐకి ఎలాంటి సంబంధం లేదని, ఇద్దరు దిగ్గజాలు తమ సొంత నిర్ణయాల మేరకే రిటైర్మెంట్ తీసుకున్నారని స్పష్టం చేశారు.
టెస్ట్ క్రికెట్ నుండి వైదొలగాలనే నిర్ణయం పూర్తిగా వారిద్దరిదేనని, బోర్డు నుండి ఎటువంటి జోక్యం లేదా ఒత్తిడి లేదని ఆయన తేల్చి చెప్పారు. టెస్ట్ క్రికెట్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేరని తాము బాధపడుతున్నామని వ్యాఖ్యానించారు. ఏ ఆటగాడు ఎప్పుడు రిటైర్ అవ్వాలి, ఏ ఫార్మాట్ నుండి రిటైర్ అవ్వాలి అని తాము ఎప్పుడూ చెప్పబోమని స్పష్టం చేశారు రాజీవ్ శుక్లా.
రిటైర్మెంట్ అనేది పూర్తిగా ప్లేయర్ల వ్యక్తిగత నిర్ణయం. వాళ్ళు (రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ) సొంతంగా రిటైర్మెంట్ తీసుకున్నారు. వాళ్ళని మేమెప్పుడూ మిస్ అవుతాం. వాళ్ళు గొప్ప బ్యాటర్లు. వాళ్ళు వన్డేల్లో అందుబాటులో ఉండటం సంతోషంగా ఉంది'' అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ 4-1 తేడాతో ఓడిపోయిన తర్వాత అనేక ఊహాగానాలు వినిపించాయి. జట్టులో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని భావించిన బీసీసీఐ, సీనియర్ ఆటగాళ్లను పక్కకు తప్పుకునేలా చేసిందనే వార్తలు వచ్చాయి. దీన్ని ఆయన తోసిపుచ్చారు. రిటైర్మెంట్ నిర్ణయాలు పూర్తిగా ఆటగాళ్లకే వదిలేస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications