డీలా పడ్డ రోహిత్ సేనను ఢీకొట్టే బలమైన ఆసీస్ టీమ్ ఇదే
India's tour of Australia: భారత జట్టు మొన్నటివరకు న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్లో బిజీగా గడిపింది. మూడు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో దారుణంగా పరాజయాన్ని చవి చూసింది. వైట్ వాష్కు గురైంది. 3-0 తేడాతో మట్టికరిచింది. కనీస పోరాట పటిమ కూడా ప్రదర్శించలేకపోయింది టీమిండియా.
ఈ మూడింట్లోనూ న్యూజిలాండ్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తొలుత బెంగళూరులో విజయఢంకా మోగించింది. అనంతరం పుణే, ఆ తరువాత వాంఖెడే టెస్ట్లల్లో భారత్ను ఓడించింది. ఈ ఓటమి ఫలితంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దిగజారాల్సి వచ్చింది భారత్కు.

ఈ పరిస్థితుల మధ్య ఆస్ట్రేలియాతో తలపడటానికి రెడీ అయింది. ఆ దేశ పర్యటనకు బయలుదేరి వెళ్లనుంది. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అయిదు టెస్ట్ మ్యాచ్లను ఆడబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక షెడ్యూల్ను క్రికెట్ ఆస్ట్రేలియా ఇదివరకే విడుదల చేసింది కూడా.
తొలి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 22వ తేదీన జరుగుతుంది. దీనికి పెర్త్ ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2:20 నిమిషాలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. రెండో టెస్ట్- డిసెంబర్ 6వ తేదీన అడిలైడ్, మూడో మ్యాచ్- 14వ తేదీన బ్రిస్బేన్, 4వ మ్యాచ్- 26వ తేదీన మెల్బోర్న్లో షెడ్యూల్ అయ్యాయి.
చివరి టెస్ట్ మ్యాచ్ వచ్చే ఏడాది జనవరి 3వ తేదీన ఉంటుంది. దీనికి సిడ్నీ వేదిక. ఈ సిరీస్లో భాగంగా భారత జట్టు.. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ 11తో డే/నైట్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడబోతోంది. ఇది పింక్ బాల్ మ్యాచ్. క్యాన్ బెర్రా స్టేడియం ఈ అరుదైన మ్యాచ్కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది.
తొలి రెండు టెస్ట్ మ్యాచ్ల మధ్య ఉండే గ్యాప్లో అంటే నవంబర్ 30, డిసెంబర్ 1వ తేదీల్లో ఈ మ్యాచ్లు ఉంటాయి. కాగా ఈ టెస్ట్ సిరీస్ను 4-1 తేడాతో గెలుచుకుంటేనే భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్కు క్వాలిఫై కాగలుగుతుంది. తన పాయింట్లను మరింత మెరుగుపర్చుకోగలుగుతుంది.
తొలి టెస్ట్లో భారత్ను ఎదుర్కొనే జట్టును ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా. మొత్తం 13 మంది సభ్యుల జట్టు ఇది. పాట్ కమిన్స్ సారథ్యాన్ని వహిస్తాడు. ఈ సిరీస్ కోసం ఓ కొత్త బ్యాటర్ను జట్టులోకి తీసుకుంది. నాథన్ మెక్స్వీనీకి అవకాశం ఇచ్చింది. ఓపెనర్గా క్రీజ్లో దిగనున్నాడు మెక్స్వీని. ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఇన్నింగ్ ఆరంభించనున్నాడు.
దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తోండటంతో అతన్ని జట్టులోకి తీసుకున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. ప్రస్తుతం అతను సౌత్ ఆస్ట్రేలియా జట్టుకు కేప్టెన్గా వ్యవహరిస్తోన్నాడు. అతనితో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ ఇంగ్లిస్కూ జట్టులో చోటు లభించింది. షెఫ్పీల్డ్ షీల్డ్ సిరీస్లో అతను ఫామ్లోకి రావడం కలిసొచ్చింది.
భారత్తో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడటానికి ఎంపిక చేసిన జట్టులో- పాట్ కమ్మిన్స్ (కేప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాంబుషెన్, నాథన్ లియోన్, మిఛెల్ మార్ష్, నాథన్ మెక్స్వీనీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్ ఉన్నారు.












Click it and Unblock the Notifications