భారత్-పాక్ మ్యాచ్ బాయ్ కాట్.. ! నేను చూడను.. ! ఓవైసీ సంచలన వ్యాఖ్యలు..!
కశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తో సంబంధాల్ని భారత్ పూర్తిగా తెంచేసుకుంది. ఆ దేశంతో ఉన్న సింధు జలాల ఒప్పందం రద్దు చేయటం, భారత గగనతలంపై పాకిస్తాన్ విమానాల్ని అనుమతించకపోవడం, ఆ దేశంతో క్రికెట్ మ్యాచ్ లు ఎక్కడా ఆడకూడదని నిర్ణయించడం జరిగిపోయాయి. తాజాగా వరల్డ్ ఛాంపియన్స్ ట్రోఫీలోనూ పాకిస్తాన్ తో మ్యాచ్ ల్ని భారత ఆటగాళ్లు బహిష్కరించారు. ఈ నేపథ్యంలో ఆసియాకప్ లో మాత్రం పాకిస్తాన్ తో దుబాయ్ లో ఆడేందుకు భారత్ సిద్దం కావడం చర్చనీయాంశంగా మారింది.
సెప్టెంబర్ 14న ఆసియాకప్ లో భాగంగా దుబాయ్ లో జరిగే భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ లోనూ మన క్రికెటర్లు ఆడకూడదన్న డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే బీసీసీఐ, కేంద్రం మాత్రం ఈ మ్యాచ్ ఆడి తీరాల్సిందేనంటున్నాయి. దీనిపై స్పందించిన ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల్ని ఆయన గుర్తుచేశారు.రక్తం, నీరు ఒకేసారి ప్రవహించలేవంటూ ఆయన వ్యాఖ్యానించారు.

పాకిస్తాన్ తో క్రికెట్ ఎందుకు ఆడుతున్నారని ఓవైసీ కేంద్రాన్ని ప్రశ్నించారు. బీసీసీఐ ఈ మ్యాచ్ కు ఎలా అనుమతి ఇచ్చిందని అడిగారు. దుబాయ్ లో ఈ మ్యాచ్ అడబోతున్నారని తెలిసి తాను ఆశ్చర్యపోయానని ఓవైసీ తెలిపారు. తానైతే ఈ మ్యాచ్ చూడబోవడం లేదన్నారు. పాకిస్తాన్ తో వాణిజ్య సంబంధాలు తెంచుకుని, వారి విమానాలకు గగనతలం మూసేసి, ఇప్పుడు క్రికెట్ ఎలా ఆడతారని ఎంఐఎం అధినేత ప్రశ్నించారు.

పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది భారతీయులు చనిపోయిన దారుణమైన ఘటన తనను తీవ్రంగా బాధించిందని, ఇది చాలా దారుణమని ఓవైసీ తెలిపారు. భార్యాపిల్లల ముందే భారతీయుల్ని చంపడం బాధాకరమైన విషయమని, ఇంత జరిగాక కూడా పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్ ఆడటంలో అర్దం లేదని ఓవైసీ తెలిపారు. ఇప్పటికైనా ఈ మ్యాచ్ ను భారత్ బహిష్కరించాలని ఓవైసీ కోరారు. బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications