ఈ ముగ్గురు మొనగాళ్లకు స్వీట్ న్యూస్
ఆస్ట్రేలియా 2027 ఐసీసీ ప్రపంచ కప్ కోసం ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించుకుంటోంది. ఈ క్రమంలో పేస్ త్రయం పాట్ కమిన్స్, మిఛెల్ స్టార్క్, జోష్ హేజిల్వుడ్ కు తీపికబురు ఇచ్చింది. వారిని జట్టులో కొనసాగించాలని నిర్ణయించింది. గాయాల బెడద, వర్క్ లోడ్ ఉన్నప్పటికీ క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ ముగ్గురు పేసర్లు టైటిల్ నిలబెట్టుకోవడంలో కీలక పాత్ర పోషిస్తారని ఆస్ట్రేలియా ఆశిస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వన్డే భవిష్యత్తుపై భారత్లో ఇంకా ప్రశ్నలు నెలకొనగా, ఆస్ట్రేలియా మాత్రం తమ అనుభవజ్ఞులైన ప్రధాన ఆటగాళ్లపైనే దృష్టి సారించింది. దీనిపై ఆస్ట్రేలియా హెడ్ కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్వుడ్ కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు ఉన్నాయని వెల్లడించారు.

ప్రపంచ కప్ ను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం వారికి విశ్రాంతి ఇవ్వడంపై మెక్డొనాల్డ్ స్పందించారు. cricket.com.auకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. 2027 వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుండే జట్టు కూర్పుపై ఆలోచనలు చేస్తోన్నామని, ఇందులో భాగంగా పాట్ కమ్మిన్స్, మిఛెల్ స్టార్క్, జోష్ హేజిల్ వుడ్ కే పేస్ బౌలింగ్ డిపార్ట్ మెంట్ ను అప్పగించాలనేది తమ ఉద్దేశమని తేల్చి చెప్పారు.
2027 వరల్డ్ కప్ వరకు వాళ్లు ఫిట్ నెస్ ను కాపాడుకోవాల్సి ఉంటుందని మెక్ డొనాల్డ్ స్పష్టం చేశారు. ఈ బిగ్గెస్ట్ టోర్నమెంట్ కోసం సన్నద్దం కావాలని, దీనికోసం కొంతవరకు వర్క్ లోడ్ ను తగ్గించుకోవాలని, విరామం తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 2027లో అందుబాటులో ఉండేలా వారి క్రికెటింగ్ ప్రణాళికలు రూపొందిస్తోన్నామని పేర్కొన్నారు.
ఐపీఎల్ ఆడాల్సి రావడంతో బంగ్లాదేశ్ పర్యటనలను పాట్ కమిన్స్, మిఛెల్ స్టార్క్, జోష్ హేజిల్వుడ్ లను దూరంగా ఉంచిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ లల్లో వాళ్లు ఆడట్లేదు. దీనిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. దీనిపై మెక్ డొనాల్డ్ స్పందించారు. దీన్ని తప్పుడు అభిప్రాయంగా తోసిపుచ్చారు. ఆటగాళ్లు తమ ఇష్టానుసారం పాల్గొనట్లేదని, ఇది జట్టు మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయమని అన్నారు.
మేజర్ టోర్నమెంట్ల కోసం ముగ్గురినీ రిజర్వ్ గా ఉంచాలనేదే జట్టు తుది నిర్ణయమని ఆయన చెప్పారు. ఈ కారణంతోనే పాకిస్తాన్, బంగ్లాదేశ్ పర్యటనల నుండి విశ్రాంతి ఇచ్చామని, 2027 ఐసీసీ ప్రపంచ కప్కు ముందు ఇది చివరి విరామం కావొచ్చని మెక్డొనాల్డ్ అన్నారు. ఆటగాళ్ళు ఎక్కడ ఆడాలి, ఏ సిరీస్లలో ఆడాలనేది బోర్డు చూసుకుంటుందే తప్ప ఇందులో మరొకరి జోక్యం ఉండదని వివరించారు.












Click it and Unblock the Notifications