మ్యాచ్లో 'దోశ ఇడ్లీ' సాంగ్.. బీసీసీఐకి సీఎస్కే సీరియస్ కంప్లైంట్!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కొత్త వివాదానికి తెరలేపింది. మైదానంలో ఆటగాళ్ల మధ్య పోరు పక్కన పెడితే.. స్టేడియంలోని డీజే ప్రవర్తన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మ్యాచ్ సాగుతున్న సమయంలో డీజే ప్లే చేసిన కొన్ని పాటలు, చేసిన కామెంట్స్ తమను కించపరిచేలా ఉన్నాయంటూ సీఎస్కే యాజమాన్యం బీసీసీఐకి అధికారికంగా ఫిర్యాదు చేసింది.
'దోశ ఇడ్లీ' పాటపై అభ్యంతరం
ఈ వివాదానికి ప్రధాన కారణం "దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ" అనే పాట. సాధారణంగా సోషల్ మీడియాలో దక్షిణ భారతీయులను, ముఖ్యంగా తమిళులను గేలి చేయడానికి లేదా మీమ్స్ కోసం ఈ పాటను నెటిజన్లు వాడుతుంటారు. అటువంటి వివాదాస్పద ట్రాక్ను ఓ అధికారిక ఐపీఎల్ మ్యాచ్లో.. అది కూడా సీఎస్కే వంటి పెద్ద జట్టు ఆడుతున్నప్పుడు ప్లే చేయడం 'బ్యాడ్ టేస్ట్' అని చెన్నై యాజమాన్యం మండిపడింది. ఇది కేవలం వినోదం మాత్రమే కాదని.. ఒక ప్రాంతీయ వివక్షను చూపేలా ఉందని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆటగాళ్లపై డీజే కామెంట్స్
పాటతో పాటు డీజే వ్యవహరించిన తీరుపై కూడా సీఎస్కే సీరియస్ అయింది. చెన్నై ప్లేయర్లు ఔట్ అయిన ప్రతిసారి డీజే మైక్ ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేశారని సీఎస్కే మేనేజింగ్ డైరెక్టర్ కాశీ విశ్వనాథన్ ఆరోపించారు. "హోమ్ టీమ్కు మద్దతు ఇవ్వడం డీజే బాధ్యత, కానీ ప్రత్యర్థి జట్టును తక్కువ చేయడం లేదా వారిని అవమానించడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ ఘటనలు దురదృష్టకరం" అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయని, బీసీసీఐ దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
బీసీసీఐ, ఐపీఎల్ కౌన్సిల్ స్పందన
సీఎస్కే చేసిన ఫిర్యాదుపై బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు స్పందించారు. ఈ ఫిర్యాదును తాము స్వీకరించామని, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రస్తుతం ఈ విషయాన్ని పరిశీలిస్తోందని తెలిపారు. స్టేడియాల్లో పాటల ఎంపిక, డీజేల ప్రవర్తనపై నిర్దిష్ట నియమ నిబంధనలు ఉంటాయని, వాటిని ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై లేదా గ్రౌండ్ అసోసియేషన్పై చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
నెట్టింట ఫ్యాన్స్ వార్
ఈ వివాదం సోషల్ మీడియాలో భారీ ఎత్తున ఫ్యాన్స్ వార్కి దారితీసింది. ఆర్సీబీ ఫ్యాన్స్ ఇది కేవలం స్టేడియంలో హుషారు పెంచడానికి చేసిన పని అని వాదిస్తుండగా.. సీఎస్కే ఫ్యాన్స్ మాత్రం ఇది తమ జట్టును అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో ఆర్సీబీ టాప్ పొజిషన్లో ఉండగా.. సీఎస్కే ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ 'డీజే వివాదం' లీగ్లో మరింత వేడిని పెంచింది. ఈ వివాదంపై బీసీసీఐ తీసుకునే నిర్ణయం కోసం క్రికెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.












Click it and Unblock the Notifications