బాలయ్య సినిమాకు థమన్ మ్యూజిక్ కొట్టినట్టు..: పిచ్చకొట్టుడు
Ashutosh Sharma: ఐపీఎల్ 2025 సీజన్ 18వ ఎడిషన్లో ఎట్టకేలకు ఓ థ్రిల్లర్ చూసే అవకాశం లభించింది తెలుగు నేలపై. ఢిల్లీ కేపిటల్స్పై గెలిచి తీరుతుందనుకున్న లక్నో సూపర్ జెయింట్స్.. మట్టికరిచింది. గెలుపు అంచుల్లో నిలిచిన ఆ జట్టు పరాజయాన్ని చవి చూడాల్సొచ్చింది.. ఒకే ఒక్కడి వల్ల.
సోమవారం రాత్రి విశాఖపట్నంలో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ కేపిటల్స్.. ఇంకా మూడు బంతులు మిగిలివుండగానే ఈ స్కోర్ను అధిగమించింది. తొమ్మిది వికెట్ల నష్టానికి 211 పరుగులతో విజయాన్ని అందుకుంది.

ఢిల్లీ ఇన్నింగ్లో అసలు హీరో అశుతోష్ శర్మ. 12.3 ఓవర్లల్లో 113 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి, ఓటమి తప్పదనుకున్న దశలో క్రీజ్లోకి దిగిన అశుతోష్ వీరవిహారం చేశాడు. గెలవాలంటే- 45 బంతుల్లో 97 పరుగులు అవసరం. అలాంటి పరిస్థితుల్లో భారీ షాట్లతో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 31 బంతుల్లో 66 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
అతనిపై ఎలాంటి అంచనాలు లేకపోవడం వల్ల స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలిగాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు విఫ్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్ మోహిత్ శర్మలతో కలిసి లక్ష్యాన్ని చేధించాడు. చివరి మూడు ఓవర్లల్లో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు అశుతోష్.
రవి బిష్ణోయ్ వేసిన 18వ ఓవర్ చివరి మూడు బంతుల్లో 12 పరుగులు కొట్టాడు. ఆ తరువాతి ఓవర్లోనూ అతని దూకుడు కొనసాగింది. అతని ప్రతాపానికి ప్రిన్స్ యాదవ్ బలి అయ్యాడు. ఆ ఓవర్ చివరి మూడు బంతుల్లో 12 పరుగులు రాబట్టడంతో ఈక్వేషన్లు మొత్తం మారిపోయాయి. అంతరం ఆరు బంతులకు ఆరు పరుగులుగా తేలింది.
చివరి ఓవర్ తొలి రెండు బంతులను మోహిత్ శర్మ ఎదుర్కొన్నాడు. షాబాజ్ అహ్మద్ వేసిన ఓవర్ అది. రెండో బంతికి సింగిల్ తీశాడు. మూడో బంతిని అశుతోష్ శర్మ సిక్సర్గా మలిచాడు. జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. అతను ఎదుర్కొన్న చివరి ఏడు బంతుల్లో 34 పరుగులు వచ్చాయంటే అతని బ్యాటింగ్ ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. 6,4,6,2,6,4,6.. పరుగులు రాబట్టుకున్నాడు.












Click it and Unblock the Notifications