గెలిచిన ఆనందం ఇంగ్లాండ్ కు లేకుండా పాయె కదా- ఆ ఒక్క తప్పుతో
ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత్ మరో ఓటమిని మూటగట్టుకుంది. గెలిచాల్సిన మ్యాచ్ ఓడిపోయింది. చేతుల దాకా వచ్చిన మ్యాచ్ ను నోటి దాకా తీసుకెళ్లడంలో ఘోరంగా విఫలమైంది. మూడో టెస్ట్ మ్యాచ్ లో 22 పరుగుల తేడాతో మట్టికరిచింది. అయిదు మ్యాచ్ ల సిరీస్ లో 2-1 తేడాతో వెనుకంజలో నిలిచింది.
లార్డ్స్ లో జరిగిన మూడో టెస్ట్ లో విజయానికి అవసరమైన 192 పరుగులను అందుకోవడంలో విఫలమైంది టీమిండియా. 170 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్ లో సత్తా చాటిన బ్యాటర్లందరూ రెండో ఇన్నింగ్ లో చేతులెత్తేశారు. నిర్లక్ష్యపు ఆటతీరును ప్రదర్శించారు. ఓటమిని కొని తెచ్చుకున్నారు.

యశస్వి జైస్వాల్- 0, కేఎల్ రాహుల్- 39, కరుణ్ నాయర్- 14, శుభ్ మన్ గిల్- 6, ఆకాష్ దీప్- 1, రిషభ్ పంత్- 9, వాషింగ్టన్ సుందర్- 0, నితీష్ కుమార్ రెడ్డి- 13, జస్ ప్రీత్ బుమ్రా- 5, మహ్మద్ సిరాజ్- 4 పరుగుుల చేశారు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఒక్కడే పోరాట పటిమ ప్రదర్శించాడు. 61 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
ఈ పరిస్థితుల మధ్య నాలుగో టెస్ట్ ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది భారత్. ఈ మ్యాచ్ ఈ నెల 23వ తేదీన ఆరంభం కానుంది. మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియం దీనికి వేదిక. ఇందులో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది టీమిండియా. దీనికోసం తుదిజట్టులో భారీ మార్పులు చేయనుంది.
ఈ మ్యాచ్ గెలిచిన ఆనందం ఇంగ్లాండ్ కు లేకుండా పోయింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ స్టాండింగ్స్లో రెండు పాయింట్లలో కోత పడింది. స్లో ఓవర్ రేటును కొనసాగించినందుకు ఇంగ్లాండ్కు మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా సైతం విధించింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్.
ఎమిరేట్స్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ రిచి రిచర్డ్సన్ ఆంక్షలను ధృవీకరించారు. ఇంగ్లాండ్ కు విధించిన జరిమానాను ఐసీసీ నిర్ధారించింది. రెండు ఓవర్లు తక్కువగా వేసినట్లు ఐసీసీ నిర్ధారించింది. రెండు పాయింట్లను తగ్గింది. ఫలితంగా డబ్ల్యూటీసీ స్టాండింగ్స్లో ఇంగ్లాండ్ పాయింట్ల సంఖ్య 24 నుంచి 22కు పడిపోయింది.
దీంతో వారి పాయింట్ల శాతం (PCT) 66.67 శాతం నుంచి 61.11 శాతానికి తగ్గింది. ఆంక్షలు ప్రకటించే ముందు ఇంగ్లాండ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా, ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం, ఆటగాళ్లు కేటాయించిన సమయంలో వేయడంలో విఫలమైన ప్రతి ఓవర్కు వారి మ్యాచ్ ఫీజులో అయిదు శాతం జరిమానా విధిస్తారు.
అదనంగా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ప్లేయింగ్ కండిషన్స్ లోని ఆర్టికల్ 16.11.2 ప్రకారం, ఒక జట్టు తక్కువగా వేసిన ప్రతి ఓవర్కు ఒక పాయింట్ కోల్పోతుంది. ఇంగ్లాండ్ రెండు ఓవర్లు తక్కువగా వేసినందున ఒక్కో ఓవర్ కు ఒక పాయింట్, మ్యాచ్ ఫీజులో అయిదు శాతం కోత పడింది.
ప్రస్తుతం డబ్ల్యూటీసీ సైకిల్లో మూడు మ్యాచ్లలో 2 విజయాలతో ఇంగ్లాండ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 3 మ్యాచ్లలో 3 విజయాలతో నంబర్ 1 స్థానంలో ఉండగా, శ్రీలంక మూడు మ్యాచ్లలో రెండు విజయాలతో రెండవ స్థానంలో ఉంది. ప్రస్తుతం భారత్ మూడు మ్యాచ్ల్లో ఒక మ్యాచ్లో మాత్రమే గెలిచి నాలుగో స్థానంలో ఉంది.












Click it and Unblock the Notifications