భారత్- పాకిస్తాన్ మధ్య సిరీస్: ట్రోఫీ పేరు కూడా ఖరార్: కేంద్రం గ్రీన్ సిగ్నల్..?!
ఇస్లామాబాద్: ఐసీసీ ప్రపంచకప్ 2023 (World Cup 2023) టోర్నమెంట్ ఫీవర్ మొదలైంది. ప్రస్తుతం వామప్స్ రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ నెల 5వ తేదీ నుంచి అసలు సిసలు మ్యాచ్లు మొదలు కానున్నాయి. గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం దీనికి వేదికగా తొలి మ్యాచ్ షెడ్యూల్ అయింది.
2019 ప్రపంచకప్ ఫైనల్స్లో హోరాహోరీగా తలపడ్డ ఇంగ్లాండ్- న్యూజిలాండ్ (ENG vs NZ) మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ కూడా కలుపుకొంటే మొత్తం 48 మ్యాచ్లు ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నాయి. నవంబర్ 12వ తేదీన భారత్- నెదర్లాండ్స్ మధ్య జరిగే మ్యాచ్తో లీగ్ దశ ముగుస్తుంది. అదే నెల 15, 16 తేదీల్లో సెమీ ఫైనల్స్ ఉంటాయి. 19వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

భారత జట్టు ముందున్న బిగ్గెస్ట్ టాస్క్ ఈ టోర్నమెంట్. ఈ నెల అక్టోబర్ 8వ తేదీన టీమిండియా తన తొలి మ్యాచ్ను ఆడబోతోంది. ఆస్ట్రేలియాతో తలపడుతుంది. మొన్నటికి మొన్నే మూడు వన్డేల సిరీస్లో ఆస్ట్రేలియాను ఓడించడం భారత్కు ఉన్న ప్లస్ పాయింట్. చివరి మ్యాచ్ ఓడినప్పటికీ సిరీస్ను సొంతం చేసుకోగలిగింది.
11వ తేదీన రెండో మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ను ఢీ కొడుతుంది. ఆ తరువాత జరిగే గేమ్లో అంటే.. తన మూడో మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఎదుర్కోనుంది రోహిత్ సేన. అందరి దృష్టీ ఈ మ్యాచ్ మీదే ఉంది. ఎప్పుడెప్పుడా అంటూ ఫ్యాన్స్ ఎదురు చూస్తోన్నారు ఈ బిగ్ క్లాష్ కోసం.
దీనికి కారణాలు లేకపోలేదు. భారత్- పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య మ్యాచ్ అంటే అది అంతకుమించి అనే స్థాయిలో ఉంటుంది. ఈ రెండు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న ఉద్రిక్త పరిస్థితులు దీనికి కారణం. పాకిస్తాన్తో మ్యాచ్ ఆడిన ప్రతీసారీ తన దేశ జట్టు గెలవాలని కోరుకుంటారు ప్రతి భారతీయుడు కూడా.
ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటే టీవీలకు అతుక్కుపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. పైగా భారత్- పాకిస్తాన్ (IND vs PAK) తలపడటం కూడా చాలా అరుదు. ఇతర జట్ల తరహాలో ఈ రెండు దేశాల మధ్య తరచూ ద్వైపాక్షిక సిరీస్లు జరగవు. ఒక దేశం మరో దేశంలో పర్యటించట్లేదు.

వరల్డ్ కప్ ఆడటానికి ఏడేళ్ల తరువాత పాకిస్తాన్ జట్టు భారత్లో అడుగుపెట్టిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల మధ్య పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB)- ఓ కీలక ప్రతిపాదన చేసింది. భారత్- పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్/ట్రోఫీ ప్రతిపాదనలను భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI)కు పంపించింది.
దీనికి గాంధీ-జిన్నా ట్రోఫీ (Gandhi-Jinnah trophy)గా పేరు పెట్టింది. ఇతర దేశాల మధ్య సాగే సిరీస్ల తరహాలోనే ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిద్దామని పీసీసీ ఛైర్మన్ జకా అష్రాఫ్ (PCB Chairman Zaka Ashraf) సూచించారు. ఇది వార్షిక ద్వైపాక్షిక సిరీస్. ప్రతి సంవత్సరం స్వదేశంలో లేదా, ఏదైనా తటస్థ వేదిక మీద ఆడేలా ప్లాన్ చేసింది పీసీబీ. ఈ ప్రతిపాదనలను బీసీసీఐ ఆమోదించాల్సి ఉంది.
క్రికెట్లో భారత్- పాకిస్తాన్ (IND vs PAK) జట్ల మధ్య జరిగే మ్యాచ్కు ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని జకా అష్రాఫ్ తెలిపారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి జట్లు కూడా తమ దేశంలో పర్యటించాయని, భారత్ మాత్రం నిరాకరిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ సిరీస్ కార్యరూపం దాల్చితే రెండు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడొచ్చనీ అన్నారు.












Click it and Unblock the Notifications