విరాట్ కోహ్లీ ట్రాప్: తొలి టెస్ట్లో 47 పరుగులకే 4 వికెట్స్ డౌన్
Virat Kohli: మొన్నటికి మొన్న న్యూజిలాండ్తో సొంతగడ్డపై టెస్ట్ సిరీస్ను కోల్పోయింది భారత్. ఏకంగా 3-0 తేడాతో పరాజయాన్ని చవి చూసింది. ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. స్వదేశంలో ఈ రేంజ్లో టెస్ట్ సిరీస్ను కోల్పోతుందని ఎవ్వరూ ఊహించనే లేదు.
ఈ దారుణ ఓటమి నుంచి భారత్ ఎలాంటి గుణపాఠాలనూ నేర్చుకోలేదనేది సుస్పష్టమౌతోంది. ఆస్ట్రేలియాపై అంతే అధ్వాన్నంగా ఆడుతోంది. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్లో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో ప్రారంభంలోనే వరుసగా వికెట్లను కోల్పోయింది టీమిండియా. 47 పరుగులకు 4 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.

తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ కష్టాలు తొలి ఓవర్ నుంచే ఆరంభం అయ్యాయి. జట్టు స్కోరు అయిదు పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయింది. మూడో ఓవర్ తొలి బంతికి ఓపెనర్ యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు. మిఛెల్ స్టార్క్ సంధించిన ఓవర్ అది. వికెట్లకు కాస్త దూరంగా 139 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఆ ఫుల్ లెంగ్త్ డెలివరీని అగ్రెసివ్గా ఆడబోయాడు జైస్వాల్.
ఎడ్జ్ తీసుకున్న ఆ బంతి గల్లీ వైపు గాల్లోకి లేచింది. అక్కడే కాపుగాసిన కామెరాన్ గ్రీన్ దాన్ని అందుకోబోయాడు గానీ విఫలం అయ్యాడు. అతని చేతుల్లో నుంచి జారిన ఆ బంతిని మెక్ స్వీనీ అద్భుతంగా అందుకున్నాడు. దీనితో ఖాతా తెరవకుండానే పెవిలియన్ దారి పట్టాడు జైస్వాల్.
జట్టు స్కోర్ 14 పరుగుల వద్ద ఉన్నప్పుడు మరో ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్ అవుట్ అయ్యాడు. జోష్ హేజిల్వుడ్ బౌలింగ్లో వికెట్ కీపర్ క్యారీకి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. ఆ తరువాత క్రీజ్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ గానీ, కేఎల్ రాహుల్ గానీ ఎంతోసేపు క్రీజ్లో నిలువలేకపోయారు.
హేజిల్వుడ్ బౌలింగ్లో ఉస్మాన్ ఖవాజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు కోహ్లీ. విరాట్ కోహ్లీని అవుట్ చేయడానికి ఎక్స్ట్రా బౌన్స్ను సంధించాడు హేజిల్వుడ్. నడుం ఎత్తుకు వరకు దూసుకొచ్చిన బంతిని ఆడటంలో విఫలం అయ్యాడు కోహ్లీ. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న ఆ బంతిని గల్లీలో ఖవాజా అందుకున్నాడు. హేజిల్వుడ్, స్టార్క్ రెండేసి వికెట్లు పడగొట్టారు.












Click it and Unblock the Notifications