రోహిత్ సేన ఘోర పరాజయం: 1955 తరువాత..!!
IND vs NZ: న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో భారత్ ఓటమి పాలైంది. 113 పరుగుల తేడాతో పరాజయాన్ని చవి చూసింది. మూడు టెస్ట్ మ్యాచ్ల ఈ సిరీస్ను 0-2 తేడాతో ఓడిపోయింది. కొమ్ములు తిరిగిన బ్యాటర్లు అట్టర్ ఫ్లాప్ అయిన మ్యాచ్ ఇది. బెంగళూరు తరహాలోనే పుణేలోనూ చేతులెత్తేశారు. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడం టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.
రెండో ఇన్నింగ్లో న్యూజిలాండ్ను తక్కువ పరుగులకే పరిమితం చేయడం ద్వారా మ్యాచ్పై బిగించిన పట్టును సడలించింది. బ్యాటర్ల స్వయంకృతాపరాథంగా చెప్పుకోవచ్చు. బౌలింగ్లో చెలరేగినప్పటికీ.. బ్యాటింగ్లో ఘోరంగా విఫలమైంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 359 పరుగులను ఛేజ్ చేయడంలో విఫలమైంది. 245 పరుగులకు చాప చుట్టేసింది టీమిండియా.

టెస్ట్ సిరీస్ సమయం చేయాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. ఇంకా రెండో రోజుల ఆట మిగిలే ఉండటం వల్ల కాస్త కుదురుగా ఆడి ఉంటే న్యూజిలాండ్ నిర్దేశించిన 359 పరుగులు చేయడం ఏ మాత్రం కష్టం కాదు. ఈ స్కోర్ను ఛేదించడానికి బరిలో దిగిన భారత బ్యాటర్లు తడబడ్డారు. ఎక్కడే గానీ కుదురుకోలేదు. వికెట్ల పతనానికి బ్రేకులూ పడలేదు.
ఓపెనర్ కేప్టెన్ రోహిత్ శర్మ వికెట్తో భారత బ్యాటింగ్ ఆర్డర్ పతనం ఆరంభమైంది. ఎనిమిది పరుగులు చేసి శాంట్నర్ బౌలింగ్లో విల్ యంగ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ. ఆ తరువాత వచ్చిన బ్యాటర్లెవరూ కూడా ఎక్కువ సేపు క్రీజ్లో నిల్చోలేకపోయారు.
శుభ్మన్ గిల్- 23, యశస్వి జైస్వాల్- 77, విరాట్ కోహ్లీ- 17, రిషభ్ పంత్- 0, వాషింగ్టన్ సుందర్- 21, తొలి టెస్ట్ మ్యాచ్ సెంచరీ హీరో సర్ఫరాజ్ ఖాన్- 9, ఆకాష్ దీప్- 1, రవీంద్ర జడేజా- 42 పరుగులు చేశారు. జస్ప్రీత్ బుమ్రా 10 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
పిచ్ పూర్తిగా స్పిన్కు అనుకూలంగా మారిన నేపథ్యంలో మిఛెల్ శాంట్నర్ చెలరేగాడు. తొలి ఇన్నింగ్ తరహాలోనే ఇప్పుడు కూడా రెచ్చిపోయాడు. ఆరు వికెట్లు కూల్చాడు. యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్ వికెట్లు శాంట్నర్ ఖాతాలో పడ్డాయి. రిషభ్ పంత్ రనౌట్ అయ్యాడు. ఎజాజ్ పటేల్- 2, గ్లెన్ ఫిలిప్స్ ఒక వికెట్ తీసుకున్నారు.
భారత్లో న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్లు ఆడటం మొదలు పెట్టిన తరువాత సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. 1955లో భారత గడ్డపై తొలి టెస్ట్ మ్యాచ్ ఆడింది కివీస్. అప్పటి నుంచి గెలవనే లేదు. ఇన్నేళ్లల్లో భారత్లో భారత్ను టెస్ట్ సిరీస్ను ఓడించడం ఇదే తొలిసారి చరిత్ర సృష్టించినట్టయింది.
12 సంవత్సరాల తరువాత భారత జట్టు సొంత గడ్డపై టెస్ట్ సిరీస్ను ఓడిపోవడం ఇదే తొలిసారి. ఈ 12 ఏళ్లల్లో 18 టెస్ట్ సిరీస్లను సొంతం చేసుకుంది. ఆ విజయాల పరంపరకు బ్లాక్ క్యాప్స్ అడ్డుకట్ట వేశారు. ఇంకో టెస్ట్ మిగిలివుండగానే భారత్ ఈ సిరీస్ను కోల్పోయింది. చివరి టెస్ట్ నవంబర్ 1వ తేదీన వాంఖెడేలో ఆరంభమౌతుంది.












Click it and Unblock the Notifications