టీమిండియా చరిత్రలో ధోనీ తరువాత అతనిదే సంచలన రికార్డ్..!!
IND vs NZ: న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో భారత్ పట్టు బిగించింది. బ్యాటింగ్లో విజృంభిస్తోంది. సత్తా చాటుతోంది. తొలి రోజు తడబడినప్పటికీ- రెండో రోజు నిలదొక్కుకుంది. బ్యాటింగ్ ధాటి ఎలా ఉంటుందో న్యూజిలాండ్ బౌలర్లకు తెలిసేలా చేసింది.
తొలి రోజు చివరి సెషన్లో 84 పరుగులకు భారత్ నాలుగు వికెట్లను కోల్పోయిన విషయం తెలిసిందే. కేప్టెన్ రోహిత్ శర్మ- 18, యశస్వి జైస్వాల్- 30, నైట్ వాచ్మెన్గా బరిలోకి దిగిన మహ్మద్ సిరాజ్- 0, విరాట్ కోహ్లీ- 4 వికెట్లను వెంటవెంటనే కోల్పోయి కష్టాల్లో పడింది. అప్పటికి వన్ డౌన్ బ్యాటర్ శుభ్మన్ గిల్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ క్రీజ్లో ఉండటం కొంత ఊరట కలిగించినట్టయింది.

అభిమానుల ఆశలను వారిద్దరూ ఏ మాత్రం కూడా నిరాశపర్చలేదు. రెండో రోజు ప్రారంభం నుంచే చెలరేగి ఆడారు. ధాటిగా బ్యాటింగ్ చేశారు. న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపారు. ఈ క్రమంలో శుభ్మన్ గిల్, రిషభ్ పంత్ ఇద్దరూ హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకున్నారు.
శుభ్మన్ గిల్- 65, రిషభ్ పంత్ 60 పరుగులు చేశారు. 60 పరుగుల చేసిన తరువాత రిషభ్ పంత్ అవుట్ అయ్యాడు. ఈష్ సోధి బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. సోధి సంధించిన లెగ్ బ్రేక్ డెలివరీని అడ్డుకోవడంలో తికమక పడ్డాడు రిషభ్ పంత్. బ్యాట్ను అడ్డు పెట్టే ప్రయత్నం చేశాడు గానీ సక్సెస్ కాలేదు. బ్యాట్ను తప్పించుకుని ప్యాడ్స్ను తాకిందా బంతి.
దీనితో ఈష్ సోధి, వికెట్ కీపర్ టిమ్ బ్లండెల్ ఎల్బీడబ్ల్యూ కోసం బిగ్ అప్పీల్ చేయడం, అంపైర్ వేలు పైకెత్తడం చకచకా సాగిపోయాయి. రిషభ్ పంత్ రివ్యూ కోరినప్పటికీ ఫలితం దక్కలేదు. బ్యాట్ను తాకకుండా బంతి దూసుకెళ్లడం రీప్లేలో స్పష్టంగా కనిపించింది. దీనితో 180 పరుగుల వద్ద అయిదో వికెట్ను కోల్పోయింది భారత్.
ఈ హాఫ్ సెంచరీతో ఓ కొత్త చరిత్ర సృష్టించాడు రిషభ్ పంత్. టెస్టుల్లో మహేంద్ర సింగ్ ధోనీ తరువాత అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్గా తన పేరును లిఖించుకున్నాడు. ధోనీ మొత్తం 39 హాఫ్ సెంచరీలు చేశాడు. అతని తరువాత 19 అర్ధసెంచరీలతో రెండో స్థానంలో నిలిచాడు పంత్.












Click it and Unblock the Notifications