India-New Zealand Semi-Final: భారత్-కివీస్ పోరుకు ముంబై సముద్ర గాలి దెబ్బ-ఛేజింగ్ లో సినిమా ?
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ సెమీస్ దశకు చేరుకుంది. ఇవాళ ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, న్యూజీలాండ్ జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్ కు రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఇద్దరు సెమీ ఫైనలిస్టులు నాకౌట్ మ్యాచ్ లో తలపడబోతున్నారు.
అయితే ఇప్పటివరకూ జరిగింది ఓ లెక్క, ఇవాళ జరగబోయేది మరో లెక్క అన్నట్లుంది పరిస్ధితి. అందుకే ఈ రెండు జట్లలో ఎవరు గెలుస్తారో ఎవరూ కచ్చితంగా చెప్పలేని పరిస్ధితి. దీని వెనుక చాలా కారణాలు కనిపిస్తున్నాయి.

భారత్-కివీస్ మధ్య ఇవాళ జరగబోయే సెమీ ఫైనల్లో టాస్ కీలక పాత్ర పోషించబోతోందని ఇప్పటికే తేలిపోయింది. దీనికి కారణం ఈ మెగాటోర్నీలో ఇప్పటివరకూ ఇక్కడ జరిగిన మ్యాచ్ లే. గత నాలుగు మ్యాచ్ ల్లోనూ టాస్ గెలిచిన జట్లు బ్యాటింగే ఎంచుకోవడంతో ఇవాళ్టి టాస్ పై కూడా ఉత్కంఠ పెరుగుతోంది. ఇంకా చెప్పాలంటే టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్లేనన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో పాటు మరికొన్ని అంశాలు కూడా ఇవాళ్టి మ్యాచ్ ను శాసించబోతున్నాయి.
ముంబైలోని వాంఖడే స్టేడియానికి పక్కనే అరేబియా సముద్రం ఉంటుంది. ఈ సముద్రపు చల్లటి గాలులు సాయంత్రం పూట కాస్త ఎక్కువగా వీస్తాయి. అసలే ఇవాళ సెమీ ఫైనల్ డే నైట్ మ్యాచ్. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసే జట్టుకు ఎండలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా రెండో బ్యాటింగ్ చేసే జట్టుకు మాత్రం ఇబ్బందులు తప్పేలా లేవు. ఇవాళ్టి మ్యాచ్ లో టాస్ కు ప్రాధాన్యం పెరగడం వెనుక మరో కారణం కూడా ఇదే. ముంబైలో సముద్రపు గాలుల దెబ్బ ఏ స్ధాయిలో ఉంటుందో చెప్పలేని పరిస్దితి ఉంది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిస్తే 300కు పైగా పరుగులు చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఇప్పటికే క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు కూడా చెప్తున్నారు. దీనికి కారణం ఛేజింగ్ లో ఈ మాత్రం లక్ష్యాన్ని ఛేదించడానికి కూడా రెండో బ్యాటింగ్ చేసే జట్టు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ముంబైలో సముద్రపు గాలులు చేజింగ్ లో తొలి పవర్ ప్లే జరిగే గంటలో అంటే సాయంత్రం ఆరున్నర గంటల నుంచి ఏడున్నర గంటల వరకూ ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ గాలుల ప్రభావంతో ఛేజింగ్ లో ఓపెనర్లు, టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ వికెట్లు కాపాడుకునేందుకు ఆత్మరక్షణలో పడాల్సి వస్తోంది. అందుకే ఇవాళ సముద్రపు గాలులు రెండో బ్యాటింగ్ ను శాసించే అవకాశముందని చెప్తున్నారు.
ఈ ప్రపంచ కప్ లో మొదటి పవర్ప్లే ముగిసే సమయానికి రెండో బ్యాటింగ్ చేసిన జట్టు స్కోర్లు ఇలా ఉన్నాయి: 67/4, 35/3, 14/6, 52/4. ఆఫ్ఘనిస్తాన్పై గ్లెన్ మాక్స్వెల్ 201 నాటౌట్తో ఒంటరిపోరు చేసిన ఆస్ట్రేలియాను మినహాయించి మిగతా జట్లన్నీ ఈ పతనం నుంచి తిరిగి కోలుకోలేక మ్యాచ్ ల్ని ప్రత్యర్ధులకు సమర్పించుకున్నాయి. దీంతో ఇదో సెంటిమెంట్ లా మారిపోయింది. అందుకే తొలి పవర్ ప్లేలో ఓపిగ్గా ఆడితే ఆ తర్వాత గంటలో పరుగులు రాబట్టవచ్చని మాజీ క్యూరేటర్లు కూడా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications