పాకిస్థాన్తో మ్యాచ్ రద్దు?
WCL 2025: క్రీడా ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ క్రికెట్ సమరం మరోసారి నిలిచిపోయింది. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ సెమీ-ఫైనల్లో భారత్ ఛాంపియన్స్ జట్టు.. పాకిస్థాన్ ఛాంపియన్స్తో తలపడేందుకు నిరాకరించింది. గురువారం జరగాల్సిన ఈ కీలక మ్యాచ్ భారత్ తీసుకున్న ఈ నిర్ణయంతో రద్దు కానుంది. పాకిస్థాన్తో ఎలాంటి క్రికెట్ మ్యాచ్ ఆడటానికి తాము సుముఖంగా లేమని భారత జట్టు స్పష్టం చేసింది.
భారత్ వైఖరి వెనుక కారణాలు.
భారత్ ఛాంపియన్స్ జట్టు ఇటీవల మంగళవారం వెస్టిండీస్ ఛాంపియన్స్ను కేవలం 13.2 ఓవర్లలోనే ఓడించి సెమీ-ఫైనల్కు దూసుకెళ్లింది. అయితే పాకిస్థాన్తో మ్యాచ్ ఆడటంపై వారు ముందుగానే తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. కేవలం సెమీ-ఫైనల్ మాత్రమే కాదు, అంతకుముందు గ్రూప్ స్టేజ్లో జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ను కూడా ఆటగాళ్ల అభ్యంతరాలు, టోర్నమెంట్ ప్రధాన స్పాన్సర్ వ్యతిరేకత కారణంగా రద్దు చేశారు.

మీడియా నివేదికల ప్రకారం.. ఈ టోర్నమెంట్ ప్రధాన స్పాన్సర్లలో ఒకటైన 'ఈజ్మైట్రిప్'(Easemytrip) అనే సంస్థ కూడా సెమీ-ఫైనల్ మ్యాచ్ నుంచి తమను తాము ఉపసంహరించుకుంది. ఈ నిర్ణయం వెనుక గల కారణాన్ని వివరిస్తూ.. కంపెనీ సహ-వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టి ఒక ప్రకటన విడుదల చేశారు. "భారత ప్రజల మనోభావాలను గౌరవిస్తూ మేము ఈ మ్యాచ్ నుండి వైదొలుగుతున్నాము. ఉగ్రవాదం, క్రికెట్ కలిసి ఉండలేవు" అని ఆయన స్పష్టం చేశారు. దేశ భద్రత, ఉగ్రవాద బెదిరింపుల నేపథ్యంలో పాకిస్తాన్తో ఎలాంటి క్రీడా సంబంధాలను కొనసాగించకూడదని భారత్లోని ప్రజలు, వివిధ వర్గాల నుంచి బలంగా వినిపిస్తున్న అభిప్రాయాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.
భారత జట్టులోని పలువురు ప్రముఖ మాజీ క్రికెటర్లు కూడా ఈ నిర్ణయానికి తమ పూర్తి మద్దతును తెలిపారు. మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్లు పాకిస్తాన్తో ఆడబోమని బహిరంగంగా ప్రకటించారు. ఈ టోర్నమెంట్లో భారత్ ప్రస్థానం అంత ఆశాజనకంగా ప్రారంభం కాలేదు. తొలి మూడు మ్యాచ్లలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలైంది. పాకిస్తాన్తో గ్రూప్ మ్యాచ్ రద్దు కావడంతో, కీలకమైన వెస్టిండీస్పై విజయం సాధించిన తర్వాతే భారత్ సెమీ-ఫైనల్కు చేరుకుంది.
గతంలో, గ్రూప్ స్టేజ్లో పాకిస్తాన్తో జరగాల్సిన మ్యాచ్ నుండి వైదొలగాలని పలువురు ఆటగాళ్లు నిర్ణయించుకున్నారు. శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్ ఈ బహిష్కరణను ప్రారంభించిన కీలక ఆటగాళ్లుగా నిలిచారు. శిఖర్ ధావన్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక లేఖను షేర్ చేశారు. అందులో భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకొని పాకిస్తాన్తో ఎలాంటి మ్యాచ్ ఆడబోనని డబ్ల్యూసీఎల్ నిర్వాహకులకు ముందుగానే తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఈ పరిణామాలు, రాజకీయ ఉద్రిక్తతలు క్రీడా సంబంధాలపై ఎంతగా ప్రభావం చూపుతున్నాయో స్పష్టం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications