ఐపీఎల్ స్టార్ ప్లేయర్ను ఇలా స్ట్రెచర్పై మోసుకెళ్లారు..
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ ప్రారంభ తేదీ సమీపించింది. ఈ మెగా టోర్నమెంట్ ఆరంభం కావడానికి ఎంతో సమయం లేదు. ఈ వారంలోనే అంటే శుక్రవారం నాడే తొలి మ్యాచ్ షెడ్యూల్ అయింది. రెండున్నర నెలల పాటు అంటే 74 రోజుల పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించబోతోంది.
ఈ నెల 22వ తేదీన రాత్రి 8 గంటలకు తొలి మ్యాచ్ జరుగనుంది. గత సీజన్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడబోతోంది. ఈ రెండు జట్లకూ ప్రతిష్ఠాత్మకంగా మారిన మ్యాచ్ ఇది. తొలి మ్యాచ్ నుంచే జైత్రయాత్ర మొదలుపెట్టాలనే పట్టుదలతో ఉన్నాయవి. చెన్నైలోని చెపాక్లో గల ఎంఏ చిదంబరం స్టేడియం ఈ హైఓల్టేజ్ మ్యాచ్కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది.

ఈ పరిస్థితుల్లో చెన్నై సూపర్ కింగ్స్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ అనారోగ్యానికి గురయ్యాడు. చిట్టాగాంగ్లో శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లో గాయపడ్డాడు. బౌలింగ్ చేస్తోన్న సమయంలో కాలి కండరాలు పట్టేశాయి. అడుగు తీసి అడుగు వేయలేకపోయాడు. ఫలితంగా అతన్ని స్ట్రెచర్ మీద మోసుకెళ్లాల్సి వచ్చింది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగింది శ్రీలంక. ఇన్నింగ్ 48వ ఓవర్ వేశాడు ముస్తాఫిజుర్. వ్యక్తిగతంగా అతని చివరి ఓవర్ ఇది. తొలి బంతిని వైడ్గా సంధించాడు. ఆ వెంటనే పిచ్పై కుప్పకూలాడు. కాలి మడమ నొప్పి అతన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. టీమ్ డాక్టర్, సపోర్టింగ్ స్టాఫ్ అతనికి సపర్యలు చేశారు గానీ కోలుకోలేకపోయాడు. స్ట్రెచర్ మీద గ్రౌండ్ నుంచి బయటికి తీసుకెళ్లారు. ఆ ఓవర్ను సౌమ్యా సర్కార్ వేశాడు.
ఈ మ్యాచ్లో ముస్తాఫిజుర్ తొమ్మిది ఓవర్లల్లో 39 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక వికెట్లను కూల్చాడు. ప్రస్తుతం అతను కోలుకోవడానికి సమయం పడుతుందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ మెడికల్ టీమ్ తెలిపింది. డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడని పేర్కొంది.
ఈ మ్యాచ్లో 50 ఓవర్లల్లో 235 పరుగులకు ఆలౌట్ అయింది శ్రీలంక. మిడిలార్డర్ బ్యాటర్ జనిత్ లియానగే సెంచరీ బాదాడు. 102 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్సర్లతో 101 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతను తప్ప మిగిలిన బ్యాటర్లెవరూ రాణించలేకపోయారు. కేప్టెన్ వికెట్ కీపర్ కుశాల్ మెండీస్ ఒక్కడే 29 పరుగులు చేశాడు.












Click it and Unblock the Notifications