కేప్టెన్గా రోహిత్ శర్మను తప్పించడంపై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ సమీపించింది. ఈ మెగా టోర్నమెంట్ ఆరంభం కావడానికి ఎంతో సమయం లేదు. ఇంకో రెండు నెలల్లో ఐపీఎల్ 2024 (IPL 2024) ఆరంభం కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి/మార్చి నెలల్లో ఐపీఎల్ 2024 సీజన్లో మొత్తం 10 జట్లు పోరాడనున్నాయి.
రెండున్నర నెలల పాటు అంటే 74 రోజుల పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే బిగ్గెస్ట్ టోర్నమెంట్ ఇది. దీని కోసం ఇప్పటి నుంచే సన్నాహకాలు సాగుతున్నాయి. ఈ నెల 19వ తేదీన ఐపీఎల్ 2024 మెగా ఆక్షన్ (IPL 2024 auction) జరుగనుంది. దుబాయ్ దీనికి వేదిక.

ఈ పరిస్థితుల్లో.. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తీసుకున్న నిర్ణయం ప్రకంపనలను సృష్టించింది. కేప్టెన్గా రోహిత్ శర్మ (Rohit Sharma)పై వేటు వేసింది. ఉన్నఫళంగా అతన్ని తొలగించింది. రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యా (Hardik Pandya)కు జట్టు పగ్గాలను అప్పగించింది.
ముంబై ఇండియన్స్ తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు దారి తీసింది. ఆ ఫ్రాంఛైజీపై నిప్పులు చెరుగుతున్నారు. #ShameOnMumbaiIndians అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. రోహిత్ శర్మను సరైన కారణం లేకుండా తప్పించిందంటూ మండిపడుతున్నారు.
ఐపీఎల్ టోర్నమెంట్లల్లో అత్యధికంగా అయిదుసార్లు జట్టును ఛాంపియన్గా నిలిపిన రోహిత్ శర్మను అత్యంత అవమానకరంగా కేప్టెన్సీ స్థానం నుంచి తప్పించిందంటూ ధ్వజమెత్తుతున్నారు. అతని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిందని, వచ్చే సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ ఆడకూడదనీ కోరుకుంటోన్నారు.
ఈ విమర్శలపై ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడా స్పందించలేదు. సారధి మార్పునకు గల కారణాలపై వివరణ ఇవ్వలేదు. కేప్టెన్సీ మార్పుపై రోహిత్ శర్మకు ముందుగానే ముంబై ఇండియన్స్ సమాచారం ఇచ్చిందని ఇండియన్ ఎక్స్ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించింది.
వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ సీజన్ నాటికి కేప్టెన్గా తప్పుకోవాల్సి ఉంటుందంటూ ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఆరంభానికి ముందే అంటే అక్టోబర్ మొదటి వారంలోనే ముంబై ఇండియన్స్ యాజమాన్యం రోహిత్ శర్మకు సమాచారం ఇచ్చిందని తెలిపింది. హార్దిక్ పాండ్యా కేప్టెన్సీలో ఆడటానికి అంగీకారం తెలిపాడని కూడా పేర్కొంది.












Click it and Unblock the Notifications