విరాట్ కోహ్లీ.. కూర్చుని తిన్నా తరగని ఆస్తి
Virat Kohli: వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్లో భారీగా మార్పులు చేర్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. రాబోయే సీజన్ మొత్తం కొత్త కొత్తగా కనిపించబోతోంది. ఈ మెగా టోర్నమెంట్ ఆడే 10 ఫ్రాంఛైజీల యాజమాన్యాలు పూర్తిస్థాయిలో ప్రక్షాళనకు దిగాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చోటు చేసుకున్న అందరి దృష్టినీ ఆకర్షించింది. విరాట్ కోహ్లీ మరోసారి కేప్టెన్సీ అవతారం ఎత్తే అవకాశాలు ఉండటమే దీనికి కారణం. తన సొంత టీమ్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పగ్గాలను అందుకోబోతోన్నాడంటూ ఇదివరకే వార్తలొచ్చాయి.

ఆర్సీబీ కేప్టెన్గా కోహ్లీకి పట్టాభిషేకం చేయడం దాదాపుగా ఖాయమైంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఐపీఎల్ 2025 రిటెన్షన్ పూర్తయిన నేపథ్యంలో విరాట్ కోహ్లీ కేప్టెన్సీపై రాయల్ ఛాలెంజర్స్ ఫ్రాంఛైజీ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
గతంలో కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కేప్టెన్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2021 సీజన్ తరువాత సారధ్య బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. కెప్టెన్సీ హోదాను స్వచ్ఛందంగా వదులుకున్నాడు. ప్లేయర్గా కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ తరువాత ఫాఫ్ డుప్లెసిస్ ఆ జట్టు సారధిగా నియమితుడయ్యాడు.
అయినప్పటికీ- ఎలాంటి అద్భుతాలూ చోటు చేసుకోలేదు రాయల్ ఛాలెంజర్స్లో. ఒక్కసారి కూడా ఛాంపియన్గా నిలవలేకపోయింది. కప్ను అందుకోవడంలో విఫలమౌతూనే వస్తోంది. 2022 సీజన్లో ప్లేఆఫ్స్ వరకు వెళ్లగలిగింది. నాలుగో స్థానంలో నిలిచింది. 2023 సీజన్లో లీగ్స్ దశకే పరిమితమైంది. ఆరో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది కూడా అంతే నాలుగో స్థానమే.
దీనితో ఆర్సీబీ యాజమాన్యం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంది. జట్టులో అత్యంత సీనియర్, టీమిండియా బ్యాటింగ్ బ్యాక్ బోన్గా నిలకడగా రాణిస్తూ వస్తోన్న విరాట్ కోహ్లీకే మరోసారి కేప్టెన్సీ పగ్గాలను అప్పగించాలని నిర్ణయించింది. ఒకరకంగా ఇది అతనికి కత్తి మీద సాములాంటిదే. ఈ సాలా కప్ నమ్దే అనే స్లోగన్ను నిజం చేయకపోతే ట్రోల్స్ బారిన పడటం ఖాయం.
ఆర్సీబీ అతన్ని రిటెన్షన్ చేసుకున్న విషయం తెలిసిందే. ముగ్గురిని మాత్రమే రిటైన్ చేసుకుంది. మిగిలిన వారందరినీ రిలీజ్ చేసింది. విరాట్ కోహ్లీ- రూ. 21 కోట్లు, రజత్ పటిదార్- రూ. 11 కోట్లు, అన్ క్యాప్డ్ ప్లేయర్ యష్ దయాళ్- 5 కోట్ల రూపాయలతో రిటైన్ చేసుకుంది. 120 కోట్ల రూపాయల పర్స్లో ఈ ముగ్గురి కోసం 37 కోట్లను చెల్లించింది. మిగిలిన మొత్తంతో ఇతర ప్లేయర్లను తీసుకుంటుంది.
తాజాగా కుదుర్చున్న 21 కోట్ల రూపాయల మొత్తంతో విరాట్ కోహ్లీ ఐపీఎల్ ఆదాయం భారీగా పెరిగింది. 200 కోట్ల రూపాయలను దాటింది. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించిన ప్లేయర్గా రికార్డు సృష్టించాడు కింగ్ కోహ్లీ. అన్ని సీజన్లల్లో ఆడటం ద్వారా అతను సంపాదించిన ఆదాయం 209.2 కోట్ల రూపాయలుగా నమోదైంది.












Click it and Unblock the Notifications