IPL 2026: కొంపముంచిన బుమ్రా.. ముంబై ఖాతాలో నాలుగో ఓటమి!
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా ఐదో మ్యాచ్లోనూ బుమ్రా వికెట్ల ఖాతా తెరవలేకపోయాడు. అంతేకాకుండా సునాయస క్యాచ్ను నేలపాలు చేసి ముంబై ఇండియన్స్ ఓటమికి ప్రధాన కారణమయ్యాడు.
బుమ్రా వైఫల్యంతో ముంబై ఇండియన్స్ వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. గురువారం వాంఖడే స్టేడియం వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ను ఓడించింది.
డికాక్ సెంచరీ వృథా..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 195 పరుగులే చేసింది. క్వింటన్ డికాక్(60 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లతో 112 నాటౌట్) అజేయ శతకంతో రాణించినా.. నమన్ ధీర్(31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 50) హాఫ్ సెంచరీతో సత్తా చాటినా ఫలితం లేకపోయింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్(3/22) మూడు వికెట్లతో ముంబై పతనాన్ని శాసించగా.. మార్కో జాన్సెన్, శశాంక్ సింగ్ తలో వికెట్ తీసారు.
అనంతరం పంజాబ్ కింగ్స్ 16.3 ఓవర్లలో 3 వికెట్లుకు 198 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ప్రభ్సిమ్రాన్ సింగ్(39 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్లతో 80 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 66) హాఫ్ సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో అల్లా గజన్ఫర్(2/31) రెండు వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్(1/38) ఒక్క వికెట్ తీసాడు. ఈ మ్యాచ్లోనూ జస్ప్రీత్ బుమ్రా(0/41) ఒక్క వికెట్ తీయలేకపోగా.. ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు.

కొంపముంచిన బుమ్రా..
196 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ ఇచ్చిన సునాయస క్యాచ్ను బుమ్రా అందుకోలేకపోయాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ప్రభ్సిమ్రాన్ సింగ్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న బుమ్రా చేతిలోకి బంతి దూసుకొచ్చింది. కానీ అతను బంతిని ఒడిసి పట్టుకోలేకపోయాడు. ఈ అవకాశంతో ప్రభ్ సిమ్రాన్ సింగ్ చెలరేగాడు. అజేయ హాఫ్ సెంచరీతో పంజాబ్ కింగ్స్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
బుమ్రా ఈ క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ కాస్త ఉత్కంఠగా మారేది. పంజాబ్ అప్పటికే ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య వికెట్ కోల్పోయింది. పంజాబ్ బ్యాటర్లు ఒత్తిడికి గురయ్యేవారు. కానీ బుమ్రా చేసిన తప్పిదం పంజాబ్కు కలిసొచ్చింది.
బ్యాటింగ్కు బొక్క పెట్టిన సూరీడు..
బ్యాటింగ్కు సూర్యకుమార్ యాదవ్ పెద్ద బొక్క పెట్టాడు. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్కు ఆశించిన ఆరంభం దక్కలేదు. రోహిత్ గైర్హాజరీలో క్వింటన్ డికాక్ ఓపెనర్గా బరిలోకి దిగగా.. ఫామ్లో ఉన్న ర్యాన్ రికెల్టన్(2) తీవ్రంగా నిరాశపర్చాడు. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఆ మరుసటి బంతికే సూర్యకుమార్ యాదవ్(0) కూడా క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో ముంబై బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. దాంతో ముంబై పవర్ ప్లేలో 2 వికెట్లకు 48 పరుగులే చేసింది.
డికాక్, నమన్ ధీర్ కాస్త టైమ్ తీసుకొని అద్భుత బ్యాటింగ్తో నాలుగో వికెట్కు 122 పరుగులు జోడించినా.. స్లాగ్ ఓవర్లలో ముంబై దూకుడుగా ఆడలేకపోయింది. డికాక్తో పాటు హార్దిక్ పాండ్యా(14), రూథర్ఫోర్డ్(1), తిలక్ వర్మ(8) వేగంగా పరుగులు చేయలేక తీవ్రంగా నిరాశపర్చారు. దాంతో ముంబై 195 పరుగులకే పరిమితమైంది. పవర్ ప్లేలో, స్లాగ్ ఓవర్లలో కాస్త దూకుడుగా ఆడి 30-40 పరుగులు అదనంగా చేసి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది.












Click it and Unblock the Notifications