IPL 2026: ఆర్సీబీ శుభారంభం.. సన్రైజర్స్కు ఘోర పరాజయం
ఐపీఎల్ 2026 సీజన్ను డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయంతో ఆరంభించింది. శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్లో సమష్టిగా రాణించిన ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను చిత్తు చేసింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 201 పరుగులు చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (38 బంతుల్లో 80), అనికేత్ వర్మ (18 బంతుల్లో 43), హెన్రీచ్ క్లాసెన్ (22 బంతుల్లో 31) దూకుడుగా ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో జాకోబ్ డఫీ, రొమారియో షెఫెర్డ్ చెరో మూడు వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, సుయాష్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.

202 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ, కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించింది. 4 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. దేవదత్ పడిక్కల్ (26 బంతుల్లో 61), విరాట్ కోహ్లీ (38 బంతుల్లో 69 నాటౌట్) అర్థ సెంచరీలతో చెలరేగగా.. రజత్ పటీదార్ (12 బంతుల్లో 31) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సన్రైజర్స్ బౌలర్లలో డేవిన్ పైన్ 2 వికెట్లు తీయగా, జయదేవ్ ఉనాద్కత్, హర్ష్ దూబే ఒక్కో వికెట్ పడగొట్టారు.
బ్యాటింగ్లో కేవలం 8 పరుగులు చేసినప్పటికీ, ఆర్సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ అద్భుతమైన ఫీల్డింగ్తో విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతను పట్టిన మూడు క్యాచ్లు సన్రైజర్స్ హైదరాబాద్ ఓటమికి ప్రధాన కారణమయ్యాయి. ముఖ్యంగా క్లాసెన్, ఇషాన్ కిషన్ క్యాచ్లను పట్టడం మ్యాచ్ను మలుపు తిప్పింది. సన్రైజర్స్ హైదరాబాద్ తమ తదుపరి మ్యాచ్ను ఏప్రిల్ 2న (గురువారం) కేకేఆర్తో ఆడనుండగా.. ఆర్సీబీ ఏప్రిల్ 5న తమ రెండో మ్యాచ్లో సీఎస్కేతో పోటీ పడనుంది.












Click it and Unblock the Notifications