అతని ముందు వెలవెల పోయిన వైభవ్ సూర్యవంశీ ఛరిష్మా
మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో టీమిండియాపై ఇంగ్లాండ్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ ఉత్కంఠ పోరులో జాకబ్ బెథెల్ 46 బంతుల్లో 76 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా, ఈ విజయంతో అయిదు మ్యాచ్ల ఈ సిరీస్లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. భారత్ నిర్దేశించిన 191 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ మరో ఓవర్ మిగిలి ఉండగానే కొట్టి అవతలపడేసింది.
లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ఆరంభంలోనే తీవ్ర కష్టాల్లో పడింది. భారత పేసర్ అర్ష్దీప్ సింగ్ ధాటికి ఓపెనర్లు ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ డకౌట్ అయ్యారు. దీంతో ఇంగ్లాండ్ ఒక పరుగుకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో హ్యారీ బ్రూక్ వీరవిహారం చేశాడు. 12 బంతుల్లోనే 39 పరుగులు చేసి భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అర్ష్దీప్ సింగ్ ఓవర్ లో 27 పరుగులు పిండుకున్నాడు. బ్రూక్ అవుటైనప్పటికీ, జాకబ్ బెథెల్ ఇన్నింగ్స్ను నిలబెట్టి జట్టుకు విజయావకాశాలను సజీవంగా ఉంచాడు.

మరో ఎండ్లో టామ్ బాంటన్ 39 పరుగులతో బెథెల్ కు చక్కని సహకారం అందించాడు. దీంతో గేర్ మార్చిన బెథెల్ చెలరేగాడు. ముఖ్యంగా రవి బిష్ణోయ్ వేసిన ఒకే ఓవర్లో 29 పరుగులు రాబట్టి మ్యాచ్ను ఇంగ్లాండ్ వైపు తిప్పాడు. సామ్ కరన్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన జోఫ్రా ఆర్చర్తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు. ఇంగ్లాండ్ ను విజయ తీరాలకు చేర్చాడు. అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు తీసినా 40 పరుగులు ఇచ్చుకున్నాడు. రవిబిష్ణోయ్ కూడా అంతే. తన నాలుగు ఓవర్ల కోటాలో 60 పరుగులు ఇచ్చాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోరు చేసింది. అభిషేక్ శర్మ- 43, ఇషాన్ కిషన్- 49 పరుగులు చేశారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 22 బంతుల్లో 37 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఇంగ్లాండ్ బౌలర్లు లియామ్ డాసన్, సామ్ కరన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వికెట్లు తీయడంతో భారత్ చివరి ఓవర్లలో ఊహించిన స్థాయిలో స్కోరు చేయలేకపోయింది. తిలక్ వర్మ చివరి ఓవర్లో వేగంగా ఆడి స్కోరును 190కి చేర్చాడు.
వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర..
ఈ మ్యాచ్ ద్వారా వైభవ్ సూర్యవంశీ నూతన రికార్డు నెలకొల్పాడు. 15 ఏళ్ల 99 రోజుల వయసులోనే టీ20 ఇంటర్నేషనల్స్ లో అరంగేట్రం చేసిన ఆటగాడిగా నిలిచాడు. టెస్టు హోదా ఉన్న దేశాల్లో అత్యంత చిన్న వయసులో టీ20 మ్యాచ్ ఆడిన క్రికెటర్గా చరిత్ర పుటల్లోకెక్కాడు. తన తొలి మ్యాచ్ లోనే 10 బంతుల్లో రెండు సిక్సర్లతో 14 పరుగులు చేశాడు. బ్యాటర్లు అద్భుత పోరాట పటిమ కనబర్చినప్పటికీ, బౌలింగ్లో అనుభవలేమి కారణంగా భారత్ మ్యాచ్ను కాపాడుకోలేకపోయింది.
బెథెల్ వ్యూహాత్మక ఇన్నింగ్స్ మ్యాచ్ ఫలితాన్ని శాసించింది. భారత్ పై బ్యాక్ అండ్ బ్యాక్ టీ20 ఇంటర్నేషనల్స్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు బెెథెల్. టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ లో టీమిండియాపై సెంచరీ బాదాడు. 48 బంతుల్లో 105 పరుగులు కొట్టాడు అప్పట్లో. దీని తర్వాత మళ్లీ భారత్ టీ20లో 46 బంతుల్లో 76 పరుగులతో జట్టును గెలిపించాడు.












Click it and Unblock the Notifications