విశాఖపట్నంపై ముత్తయ్య మురళీధరన్ సంచలన వ్యాఖ్యలు
అమరావతి: వెండితెరపై రాబోతోన్న మరో బయోపిక్ మూవీ.. 800. శ్రీలంక లెజెండరీ క్రికెటర్, రైటార్మ్ స్పిన్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. అక్టోబర్ 6వ తేదీన విడుదల కాబోతోంది. ఈ స్పోర్ట్స్ డ్రామాలో మాధుర్ మిట్టల్ లీడ్ క్యారెక్టర్లో నటించారు. ముత్తయ్య మురళీధరన్ పాత్ర ఆయనదే.
మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్ పతాకంపై వివేక్ రంగాచారి ఈ సినిమాను తెరకెక్కించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకుడు. ఘీబ్రాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో మహిమా నంబియార్, నాజర్.. కీలక పాత్రల్లో నటించారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాకు సమర్పకుడు.

సింహళీయుల ప్రాబల్యం అధికంగా ఉన్న శ్రీలంకలో తమిళుడైన ముత్తయ్య మురళీధరన్ ఎలా ఆ దేశ జాతీయ జట్టులో చోటు సంపాదించగలిగాడు? ఎలా సత్తా నిలదొక్కుకోగలిగాడు?, చిన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? అనే అంశాల చుట్టూ కథను అల్లుకుంది యూనిట్.
133 టెస్ట్ మ్యాచ్లల్లో 800 వికెట్లను పడగొట్టిన ఏకైక బౌలర్ ఆయనే. 350 వన్డే ఇంటర్నేషనల్స్, 12 టీ20 మ్యాచ్లల్లో శ్రీలంక జాతీయ జట్టు తరఫున ఆడాడు. అలాగే- ఐపీఎల్లో 66 మ్యాచ్ల్లో 63 వికెట్లు పడగొట్టాడు. ఆయన కేరీర్ మొత్తం ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీలో కొనసాగుతున్నారు.

ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోన్నారు ముత్తయ్య మురళీధరన్. ఇందులో భాగంగా హైదరాబాద్కూ వచ్చారు. తెలుగు ఫిల్మీబీట్తో పాటు కొన్ని న్యూస్ ఛానళ్లకూ ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. టాలీవుడ్లో తనకు ఇష్టమైన హీరో నాని అంటూ చెప్పుకొచ్చారు.
అదే సమయంలో- భారత్లో తనకు ఇష్టమైన సిటీ విశాఖపట్నం అని చెప్పుకొచ్చారు ముత్తయ్య మురళీధరన్. హైదరాబాద్తో పోల్చుకున్నా కూడా తనకు వైజాగ్ సిటీ అంటే ఎంతో ఇష్టమని అన్నారు. దీనికి కారణాన్నీ వివరించారు. వైజాగ్ వాతావరణం శ్రీలంకకు దగ్గరగా ఉంటుందని, సముద్ర తీర ప్రాంతం కావడం అదనపు ఆకర్షణగా అభివర్ణించారు.












Click it and Unblock the Notifications