T20 World Cup 2026:భారత్ తో ఆడకుండా, ఐసీసీ దెబ్బ పడకుండా..!పాక్ జిత్తులు..!
టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి 10 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ వరల్డ్ కప్ లో ఆడకుండా బంగ్లాదేశ్ పై ఇప్పటికే ఐసీసీ వేటు వేసింది. బంగ్లాదేశ్ కు మద్దతుగా ఈ మెగా టోర్నీలో ఆడకుండా తాము కూడా బాయ్ కాట్ చేయాలని పాకిస్తాన్ (pakistan) ఆలోచిస్తోంది. అదే సమయంలో ఐసీసీ ఆంక్షల దెబ్బ పడకుండా ఏం చేయాలనే దానిపై వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి మధ్యేమార్గంగా ఓ విరుగుడు వ్యూహంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చర్చిస్తున్నట్లు సమాచారం.
పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను ఐపీఎల్ నుంచి తప్పించినందుకు నిరసనగా బంగ్లాదేశ్.. భారత్ లో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడకూడదని నిర్ణయించింది. వేదికను శ్రీలంకకు మార్చాలని పదే పదే కోరింది. కానీ ఐసీసీ నిరాకరించడంతో చేసేది లేక వరల్డ్ కప్ నుంచి వైదొలగింది. అయితే బంగ్లాదేశ్ కు మద్దతుగా తాము కూడా వరల్డ్ కప్ లో మ్యాచ్ ల్ని పాక్షికంగా లేదా పూర్తిగా బహిష్కరించేందుకు పాకిస్తాన్ సిద్దమవుతోంది. అదే జరిగితే బంగ్లాదేశ్ కంటే దారుణంగా పాకిస్తాన్ బోర్డుకు ఆర్ధిక నష్టాలు తప్పవు.

పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ ఆడకుండా బహిష్కరిస్తే రాబోయే ఐసీసీ టోర్నీలు ఆడకుండా చెక్ పెట్టడంతో పాటు పాకిస్తాన్ లీగ్ లో విదేశీ ఆటగాళ్లు పాల్గొనేందుకు ఎన్వోసీలు కూడా ఇవ్వకుండా అడ్డుకోవాలని ఐసీసీ భావిస్తోంది. అలాగే పాకిస్తాన్ ఆడే అన్ని ద్వైపాక్షిక టోర్నీల్ని నిలిపేయాలని భావిస్తోంది. మరోవైపు పాకిస్తాన్ జట్టు తమ ప్రభుత్వ రాజకీయ జోక్యంతో టీ20 వరల్డ్ కప్ బహిష్కరించినట్లు తేలితే బోర్డుపై వేటు పడుతుంది. అప్పుడు ఐసీసీ నియమించే తాత్కాలిక కమిటీ సాయంతో మ్యాచ్ లు ఆడొచ్చు.

దీంతో ఇదే వ్యూహాన్ని ఇప్పుడు అమలు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ కు సంఘీభావంగా భారత్ తో భారత్ లో జరిగే మ్యాచ్ ఆడకుండా బాయ్ కాట్ చేసి, దాని వెనుక ప్రభుత్వ నిర్ణయం ఉన్నట్లు చెప్పుకుంటే చాలని పీసీబీ భావిస్తోంది. అప్పుడు పీసీబీపై వేటు పడినా ఆర్ధిక నష్టాల వంటి ఆంక్షల బారి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఐసీసీ నియమించే కమిటీ సాయంతో మ్యాచ్ లు యథావిధిగా ఆడుకునేలా వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. రేపు శుక్రవారం దీనిపై పీసీబీ తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications