ఎంజాయ్.. పండగోవ్: ప్లేఆఫ్స్ చేరిన జట్లు ఇవే
IPL 2025 Playoffs: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ముగింపుదశకు వచ్చేసింది. అన్ని జట్లు కూడా ఒకట్రెండు మ్యాచ్ లు మాత్రమే ఆడాల్సి ఉంది. రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 29వ తేదీన ప్లేఆఫ్స్ ఆరంభమౌతాయి. జూన్ 3వ తేదీన ఫైనల్స్ ఉంటుంది. ఈ సారి ఛాంపియన్ ఎవరనేది ఉత్కంఠభరితంగా మారింది.
ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఢిల్లీ కేపిటల్స్ ను మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ కేపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. ఆ స్కోర్ ను గుజరాత్ టైటాన్స్ ఊది అవతలపడేసింది. సరిగ్గా 19 ఓవర్లల్లో ఒక్క వికెట్ కూడా నష్ట పోకుండా 205 పరుగులు సాధించింది.

ఈ మ్యాచ్ రెండు ఇన్నింగుల్లోనూ రెండు సెంచరీలు నమోదు కావడం.. ఆయా జట్ల పోరాట పటిమకు అద్దం పట్టింది. ఢిల్లీ కేపిటల్స్ లో కేఎల్ రాహుల్ 112 పరుగులతో నాటౌట్ గా నిలవగా.. గుజరాత్ టైటాన్స్ లో ఆ పాత్రను పోషించాడు ఓపెనర్ సాయి సుదర్శన్. 108 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
61 బంతుల్లో నాలుగు భారీ సిక్సర్లు, డజను ఫోర్లతో కదం తొక్కాడు సాయి. అతని దూకుడుకు అడ్డుకట్ట వేేసే బౌలరే లేకుండా పోయాడు. ఈ సీజన్ మొత్తం అతని ప్రతాపం కొనసాగుతూనే వస్తోంది. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్ లల్లోనే 617 పరుగులు బాదాడు. ఇందులో ఒక సెంచరీ, అయిదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
లీగ్స్ దశలో ఇంకా రెండు మ్యాచ్ లు, నాకౌట్స్ మిగిలే ఉండటం వల్ల అతని విజ్రంభణ మున్ముందు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. 56.09 బ్యాటింగ్ యావరేజ్ నమోదు చేశాడు సాయి సుదర్శన్. 157 స్ట్రైక్ రేట్ తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తోన్నాడీ సీజన్ లో.
మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ 53 బంతుల్లో ఏడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 93 పరుగులు చేశాడు. వీరిద్దరి బ్యాటింగ్ ప్రతాపం ముందు ఢిల్లీ బౌలర్లందరూ చేతులెత్తేశారు. టీ నటరాజన్, అక్షర్ పటేల్, దుష్మంత చమీరా 11కు పైగా ఎకానమీని నమోదు చేశారు.
అంతకుముందు ఢిల్లీ కేపిటల్స్ ఇన్నింగ్ లో కూడా దాదాపుగా ఇలాంటి బ్యాటింగే కనిపించింది. పరుగుల ప్రవాహం పారింది. కేఎల్ రాహుల్ 65 బంతుల్లో నాలుగు సిక్సర్లు 14 ఫోర్లతో 112 పరుగులు చేశాడు. అభిషేక్ పోరెల్- 30, అక్షర్ పటేల్- 25, ట్రిస్టన్ స్టబ్స్- 21 దూకుడుగా ఆడారు.
గుజరాత్ టైటాన్స్ సాధించిన ఈ విజయం.. ఒకేసారి మూడు జట్లను ప్లేఆఫ్స్ కు చేర్చడం ఈ మ్యాచ్ హైలైట్. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకిన గుజరాత్ టైటాన్స్, రెండో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, థర్డ్ పొజీషన్ లో కొనసాగుతున్న పంజాబ్ కింగ్స్.. ప్లేఆఫ్స్ కు చేరుకున్నాయి.
ఇంకొక బెర్త్ మాత్రమే మిగిలివుంది. దీనికోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్ పోటీ పడుతున్నాయి. ముంబై ఇండియన్స్ తన తదుపరి మ్యాచ్ లో ఢిల్లీ కేపిటల్స్ తో తలపడాల్సి ఉంది. ఈ నెల 23వ తేదీన ఈ మ్యాచ్ జరుగనుంది. 26వ తేదీన పంజాబ్ కింగ్స్ ను ఢీ కొడుతుంది.
ఈ రెండింటినీ ముంబై ఇండియన్స్ గెలవాల్సి ఉంది. ఈ రెండింట్లోనూ ఓడిపోతే మాత్రం ఢిల్లీ కేపిటల్స్ కు అవకాశం లభించినట్టవుతుంది. కోల్ కత నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్.. ఇంటిదారి పట్టాయి.












Click it and Unblock the Notifications