సూపర్ ఫిట్గా మారిన రిషబ్ పంత్, కొత్త లుక్ - మార్చేసిన ఆ 'తపస్సు'..కసి..!!
రిషబ్ పంత్ పూర్తిగా మారిపోయారు. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు కొత్త లుక్ తో సిద్దం అయ్యారు. రోహిత్ శర్మ స్పూర్తిగా పంత్ బరువు తగ్గటంతో పాటుగా పూర్తిగా ఫిట్ నెస్ సాధించారు. అయిదు నెలల కాలంగా నెట్స్ లో చేస్తున్న ప్రాక్టీసు ఒక తపస్సులా చేసారు. గత ఫాంలోకి రావాలనే కసి రిషబ్ ను పూర్తిగా మార్చేసింది. ఐపీఎల్ ప్రారంభం వేళ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ హాట్ టాపిక్ గా మారారు.
పంత్ తనను తాను పూర్తిగా మార్చుకున్నారు. చెన్నైలో లక్నో శిబిరానికి చేరుకోవడానికి ముందు పంత్ ఐదు రోజుల పాటు ముంబైలో దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ దగ్గర ప్రత్యేక శిక్షణ పొందాడు. శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ వంటి ఆటగాళ్లను తీర్చిదిద్దిన యువీ.. పంత్కు షాట్ సెలక్షన్, బ్యాట్ స్వింగ్, మానసిక స్పష్టతపై మెళకువలు నేర్పారు. ఎక్కడా తన దూకుడును తగ్గించకుండానే, ఏ బంతిని ఎలా ఆడాలో అనే విషయంలో శిక్షణ పొందారు. మధ్యాహ్నం 3 గంటలకు మొదలుపెట్టి సాయంత్రం 5:20 వరకు విరామం లేకుండా పంత్ బ్యాటింగ్ చేశాడు. పేసర్లు, స్పిన్నర్లను మార్చి మార్చి ఆడుతూ వారిని అలసిపోయేలా చేశాడు. అసిస్టెంట్ కోచ్ లాన్స్ క్లూజనర్ పర్యవేక్షణలో వైడ్ యార్కర్లను ఎలా ఎదుర్కోవాలో ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశాడు. గతంలో రిస్క్ తీసుకుని అవుట్ అయిన సందర్భాల నుంచి పాఠాలు నేర్చుకుని.. ఇప్పుడు మరింత రాటు దేలిన బ్యాటింగ్ తో ఐపీఎల్ కు సమాయత్తం అవుతున్నారు.

ఆ స్థానం కోసం కసిగా.. తపస్సు లా
టెస్ట్ క్రికెట్లో టీమిండియా నంబర్ 1 కీపర్గా ఉన్నప్పటికీ, వైట్-బాల్ క్రికెట్లో పంత్ స్థానం కాస్త సందిగ్ధంలో పడింది. ఇప్పటికే ఇషాన్ కిషన్, సంజు శామ్సన్ అద్భుతమైన ఫామ్లో ఉండటం, వన్డేల్లో కె.ఎల్ రాహుల్ ఫస్ట్ ఛాయిస్ కీపర్గా ఉండటంతో పంత్ రిజర్వ్ బెంచ్కే పరిమితమవుతున్నారు. గత ఐపీఎల్ సీజన్లో రూ.27 కోట్ల భారీ ధర దక్కించుకున్నా.. కేవలం 269 పరుగులు మాత్రమే చేయగలిగాడు పంత్. ఈ నేపథ్యంలో, ఈ ఐపీఎల్ సీజన్లో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించడానికి ఒక సువర్ణావకాశంగా భావిస్తున్నాడు. నిపుణుల పర్యవేక్షణలో 'స్మార్ట్ ఫిట్నెస్'పై దృష్టి పెట్టాడు రిషబ్. పరుగుల కోసం ఆకలితో ఉన్న సింహంలా కనిపిస్తున్న పంత్, ఈ ఐపీఎల్లో లక్నోను ఏ మేరకు ముందుకు తీసుకెళ్తారనేది ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను అనుసరిస్తూ.. సూపర్ ఫిట్ అయ్యాడు. 28 నుంచి ఐపీఎల్ 2026 ప్రారంభం కానుండగా.. ఎల్ఎస్జీ తన తొలి మ్యాచ్ మార్చి 5న ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది.












Click it and Unblock the Notifications