సెమీస్ చేరేవి ఈ నాలుగు జట్లే - మాజీ క్రికెటర్ల లెక్క ఇలా..!!
T20 World cup: టీ20 ప్రపంచ కప్ లో అసలు సిసలు మ్యాచులు మొదలయ్యాయి. సూపర్ 8 మ్యాచ్ లు జట్ల సమర్థతకు పరీక్షగా మారుతున్నాయి. ప్రతీ మ్యాచ్ కీలకం కానుంది. లీగ్ దశలో అన్ని మ్యాచుల్లో విజయం సాధించి సూపర్ 8 కు చేరుకున్న టీమిండియా కు సూపర్ -8 లో బలమైన ప్రత్యర్థులతో తల పడుతోంది. సెమీస్ చేరాలంటే లీగ దశలో సూర్య టీం చేసిన పొర పాట్లు రిపీట్ కాకుండా చూసుకోవటంతో పాటుగా... కొత్త వ్యూహాలు అవసరమని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. అదే సమయంలో టీమిండియా సెమీస్ వెళ్లటం ఖాయమని చెబుతున్నారు.
మాజీ క్రికెటర్లు చటేశ్వర్ పూజారా.. మహ్మద్ కైఫ్ సూపర్ 8 నుంచి సెమీస్ కు చేరుకునే అవకాశం ఉన్న నాలుగు జట్ల అంచనాలను వెల్లడించారు. టీమిండియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, న్యూజీలాండ్ సెమీస్ చేరుతాయని పూజారా చెబుతుంటే... ఇండియా, సౌతాఫ్రియా, ఇంగ్లాండ్ తో పాటుగా న్యూజీలాండ్ సెమీస్ చేరుతుందని కైఫ్ అంచనాగా వెల్లడించారు. అయితే, ఇదే సమయంలో టీమిండియా ముందు ఉన్న సవాళ్లను మాజీ క్రికెటర్లు ప్రస్తావిస్తున్నారు. సూపర్ -8 దశలో టీమిండియా ఎదుర్కొంటున్న మూడు జట్లు బలమైనవే. గత టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి భారత్ ట్రోఫీ గెలుచుకుంది. ఈ సారి ప్రోటీస్ జట్టు ప్రతీకారం తీర్చుకునే లక్ష్యంతో బరిలోకి దిగనుంది. అహ్మదాబాద్ లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సూర్య టీంకు కీలకంగా మారుతోంది. అదే విధంగా సికందర్ రజా నాయకత్వంలోని అండర్డాగ్ జింబాబ్వే ఈ వరల్డ్ కప్లో అందరినీ ఆకట్టుకుంది. గ్రూప్ స్టేజ్లో ఆస్ట్రేలియాను ఓడించడం, చివరి మ్యాచ్లో శ్రీలంకను మట్టికరిపించడం ద్వారా సూపర్-8కు అర్హత సాధించింది. జింబాబ్వేతో ఫిబ్రవరి 26న చెన్నైలో భారత జట్టు తలపడనుంది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్, జింబాబ్వే జట్లు ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే ఎదురుపడ్డాయి.

ప్రతీ మ్యాచ్ కీలకంగా.. సెమీస్ చేరాలంటే
అయితే, అప్పటి జింబాబ్వే లాగా ప్రస్తుతం ఆ టీం లేదని లీగ్ మ్యాచుల్లో తేలి పోయింది. దీంతో.. టీమిండియా ఏ మాత్రం లైట్ గా తీసుకున్నా నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇక.. సూపర్ -8 దశలో మార్చి 1న వెస్టిండీస్తో హై వోల్టేజ్ మ్యాచ్ ఆడనుంది. వెస్టిండీస్ ఈ టోర్నీలో చేసిన ధమాకా ప్రదర్శనతో అందరిలోనూ ఆ టీం పై అంచనాలు పెరిగాయి. గ్రూప్ సీలో నాలుగు మ్యాచ్లలో నాలుగింటినీ గెలిచి వెస్టిండీస్ తమ లక్ష్యం ఏంటో స్పష్టం చేసింది. మార్చి 1న భారత్-వెస్టిండీస్ మధ్య జరిగే పోరు సెమీఫైనల్ టికెట్కు కీలకంగా మారనుంది. గ్రూప్-ఏలో భారత్, సౌతాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్ ఉండగా...ఈ జట్లు గ్రూప్ స్టేజ్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టాప్లో నిలిచాయి. అభిషేక్ శర్మ వరుస డకౌట్లు ఇప్పుడు టీం ఇండియాకు పెద్ద సవాల్ గా మారుతోంది. దీంతో.. సూపర్ -8 వేళ మూడు మ్యాచుల్లో సూర్య టీం ఎలాంటి ఆట తీరుతో సెమీస్ లోకి వెళ్తుందనేది ఫ్యాన్స్ లో ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications