లవర్ కోసం లీగ్ వదులుకున్న క్రికెటర్!
మ్యాచ్ జరుగుతున్న సమయంలో తన మొబైల్ ఫోన్లో ప్రియురాలికి మెసేజ్ పంపినందుకు తమిళనాడు క్రికెటర్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. బీసీసీఐ అవినీతి నిరోధక, భద్రతా విభాగం నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆ ఆటగాడికి రూ.లక్ష జరిమానా విధించింది. అతడిని తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్పిఎల్)లో ఆడకుండా బహిష్కరిస్తూ కఠిన చర్యలు తీసుకున్నారు. 26 ఏళ్ల ఈ ఆటగాడు గతంలో తమిళనాడు తరఫున రంజీ ట్రోఫీలో ఆడాడు. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో అతడి పేరును వెల్లడించలేదని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ స్పష్టం చేసింది.
ఈ సంఘటన ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (PMOA) పరిధిలో జరిగింది. డగౌట్, డ్రెస్సింగ్ రూమ్ వంటి నియంత్రిత ప్రాంతాల్లో మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు లేదా ఏ ఇతర కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగించడం పూర్తిగా నిషేధం. సదరు క్రికెటర్ మ్యాచ్ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ వాడినట్లు బీసీసీఐ అవినీతి నిరోధక, భద్రతా విభాగం(ఏసీఎస్యూ ) పసిగట్టి ఆ విషయాన్ని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్లింది. దీని ఆధారంగానే ఈ చర్యలు చేపట్టారు. అయితే ఆటగాడిపై అవినీతి, మ్యాచ్ ఫిక్సింగ్ లేదా బెట్టింగ్ కు సంబంధించిన ఆరోపణలు ఏవీ లేవని.. కేవలం భద్రతా నిబంధనల ఉల్లంఘటన కారణంగానే ఈ క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. ఆ అధికారి ప్రకారం.. ఆ క్రికెటర్ మ్యాచ్ సమయంలో తన ప్రియురాలికి టెక్స్ట్ మెసేజ్లు పంపుకుంటున్నాడు.

బీసీసీఐ PMOA నియమం అంటే ఏమిటి?
బీసీసీఐ నియమాల ప్రకారం.. ఆటగాళ్లు మరియు సహాయక సిబ్బంది PMOAలోకి ప్రవేశించే ముందు తమ మొబైల్ ఫోన్లు, స్మార్ట్వాచ్లను స్విచ్ ఆఫ్ చేసి వాటిని నియమించబడిన భద్రతా అధికారుల వద్ద డిపాజిట్ చేయాలి. మ్యాచ్ సమయంలో జట్టు సభ్యులు, బయటి వ్యక్తులతో లేదా బెట్టింగ్ రాయుళ్లతో ఆటగాళ్లకు అనధికారిక సంప్రదింపులు జరగకుండా నిరోధించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇటీవలి కాలంలో స్మార్ట్ గ్లాసెస్, గాగుల్స్ వంటి నూతన సాంకేతిక పరికరాల వాడకం పెరిగిన దృష్ట్యా బీసీసీఐ అవినీతి నిరోధక, భద్రతా విభాగం తన తనిఖీలను మరింత తీవ్రతరం చేసింది.
గతంలో ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2026 సమయంలో, రాజస్థాన్ రాయల్స్ జట్టు మేనేజర్ రోమీ భిందర్ ఇలాంటి ఉల్లంఘనలోనే చిక్కుకున్నారు. గౌహతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన ఓ మ్యాచ్ సందర్భంగా ఆయన డగౌట్లో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ కనిపించారు. ఆయన ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని భావించిన బీసీసీఐ.. రూ.లక్ష జరిమానా విధించి హెచ్చరిక జారీ చేసింది. ప్రస్తుత కేసులో ఈ చర్య ఓ అడుగు ముందుకు వేసింది, ఈ తమిళనాడు క్రికెటర్కు జరిమానా విధించడంతో పాటు తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో ఆడకుండా నిషేధించారు.













Click it and Unblock the Notifications