సంజు శాంసన్ ను కనీసం మిడిలార్డర్ లోనైనా ఆడించండి: దూబే ప్రమోషన్ అవసరమా
ఇంగ్లాండ్ లో పర్యటిస్తోన్న టీమిండియా.. నేడు తన చివరి టీ20 మ్యాచ్ ఆడబోతోంది. అయిదు మ్యాచ్ సిరీస్ ఇది. ఒక మ్యాచ్ డ్రా కాగా ఇంగ్లాండ్ మూడింట్లో నెగ్గింది. ఇంకో మ్యాచ్ మిగిలివుండగానే ఇంగ్లాండ్ 3-0 తేడాతో సిరీస్ నూ సొంతం చేసుకుంది. ఈ సాయంత్రం జరగబోయే మ్యాచ్ నామమాత్రమే. ఇందులో కూడా ఓడితే వైట్ వాష్ కు గురి అవుతుంది టీమిండియా. దీన్ని తప్పించుకోవాలంటే గెలవక తప్పదు శ్రేయాస్ సేనకు.
ఈ పరిస్థితుల్లో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ సాబా కరీం తెరపైకి వచ్చారు. టీమిండియా కూర్పును తప్పుపట్టారు. సంజు శాంసన్ ను తీసుకోకపోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. వైభవ్ సూర్యవంశీ కోసం సంజు శాంసన్ ను పక్కన పెట్టాల్సి రావడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. వైట్ వాష్ నుంచి తప్పించుకోవడానికి కనీసం ఈ మ్యాచ్ లో అయినా సంజు శాంసన్ ను జట్టులోకి తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.

తప్పనిసరి పరిస్థితుల్లో వైభవ్ సూర్యవంశీని జట్టులో కొనసాగించాల్సి వస్తే.. సంజు శాంసన్ ను కనీసం మిడిల్ ఆర్డర్ లో అయినా ఆడించాలని సాబా కరీం సూచించాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న సగం మంది ప్లేయర్ల కంటే అతను ఎంతో మెరుగ్గా ఆడగలడని అన్నారు. టీ20 వరల్డ్ కప్ లో అతను ఆటతీరును ఈ సందర్భంగా గుర్తు చేశారు. అప్పుడు కూడా ప్రత్యామ్నాయ బ్యాటర్ గానే తుదిజట్టులో చోటు దక్కించుకున్న సంజు శాంసన్ ఏకంగా జట్టును వరల్డ్ కప్ ఛాంపియన్ గా నిలబెట్టాడని పేర్కొన్నారు.
శివమ్ దూబేను టీమి ఉపయోగించుకోవడాన్ని సాబా కరీం తప్పు పట్టారు. అతన్ని ఎలా వినియోగించుకోవాలనేది జట్టుకు అర్థం అయినట్టు లేదని వ్యాఖ్యానించారు. భారత్ అనుసరించిన వ్యూహాత్మక విధానం సరికాదని అన్నారు. బ్యాటింగ్ ఆర్డర్లో శివమ్ దూబేను ప్రమోట్ చేయడాన్నీ ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. జట్టు బ్యాటింగ్ వ్యూహంపై అంచనాలకు అందట్లేదని, ఆరంభంలోనే వికెట్లు పడిపోయిన తర్వాత, ఇన్నింగ్స్ను పునర్నిర్మించగల సమర్థవంతమైన బ్యాటర్ను పంపకుండా శివమ్ దూబేను ప్రమోట్ చేయడం సరికాదని చెప్పారు.

నాలుగో మ్యాచ్ లో తొలి మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత భారత్ తమ దూకుడు వ్యూహాలను విరమించుకుందని, జట్టులో అందుబాటులో ఉన్న బ్యాటింగ్ బలాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడంలో విఫలమైందని సాబా కరీం అభిప్రాయపడ్డారు. క్లిష్ట పరిస్థితుల్లో ఇన్నింగ్స్ను పునర్నిర్మించే ఆటగాడి కంటే దూబేను ముందుకు తీసుకుని రావడం మంచిది కాదని చెప్పాడు. దూబే ఓ స్పెషలిస్ట్ పవర్ హిట్టర్గా డెత్ ఓవర్లల్లో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని, అతని శైలి లోయర్ మిడిలార్డర్ లోనే చక్కగా సరిపోతుందని అన్నాడు.
దీనికి బదులుగా ఇన్నింగ్స్ను పునర్నిర్మించాల్సిన దశలో అతన్ని ప్రమోట్ చేయడం వల్ల ఉపయోగం ఉండబోదని సాబా కరీం అన్నారు. శివమ్ దూబే పని భారీ షాట్లు ఆడటమేనని, అలాంటి బ్యాటర్ ను క్రీజ్ లో కుదురుగా ఆడాల్సిన అయిదో స్థానంలో పంపడంలో అర్థం లేదని అన్నారు. ఒత్తిడిని తట్టుకుని శ్రేయాస్ అయ్యర్తో కలిసి ఇన్నింగ్స్ను నిర్మించడంలో వైస్ కెప్టెన్ తిలక్ వర్మ మెరుగ్గా రాణించగలడని, అతడిని ప్రమోట్ చేయకపోవడానికి కారణం ఏంటో తెలియట్లేదని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications