టీ20ల్లో డబుల్ సెంచరీ: నా ఆశ, ఆశయం అదే: వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్ ప్లేఆఫ్స్ బెర్తులు ఖరారయ్యాయి. రాజస్థాన్ రాయల్స్ ఆఖరి ప్లేఆఫ్ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతో ఈ సీజన్ నాకౌట్ దశకు రంగం సిద్ధమైంది. వాంఖడే స్టేడియంలో ఆదివారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 30 పరుగుల తేడాతో విజయం సాధించి, చివరి నాలుగు స్థానాల్లో చోటు దక్కించుకుంది. దీంతో లీగ్ దశకు తెర పడింది. ఇక ప్లేఆఫ్స్ మొదలు కానున్నాయి. తొలి మ్యాచ్ మంగళవారం జరుగనుంది.
రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ కు అర్హత సాధించడంలో కీలక పాత్ర పోషించాడు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. ఆరంభం నుంచీ ఐపీఎల్ లో సత్తా చాటుతూనే వస్తోన్నాడు. రెండు సీజన్లల్లో 21 మ్యాచ్ల్లో 39.76 సగటు, 223.87 స్ట్రైక్ రేట్తో 835 పరుగులు సాధించాడు. వీటిలో రెండు శతకాలు, నాలుగు అర్ధ శతకాలు ఉన్నాయి. అతని అత్యధికంగా వ్యక్తిగత స్కోరు 103. మొత్తం 77 సిక్సర్లు కొట్టాడు.

తాజాగా తన లక్ష్యం ఏమిటో వివరించాడు. క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టి, టీ20 క్రికెట్లో తొలి డబుల్ సెంచరీ చేయడమే తన తదుపరి లక్ష్యమని తెలిపాడు. టీ20ల్లో 200 పరుగుల సాధించిన ప్లేయర్గా చరిత్ర సృష్టించాలనేది తన టార్గెట్ అని స్పష్టం చేశాడు. ఇంగ్లాండ్ మాజీ సారథి కెవిన్ పీటర్సన్ యూట్యూబ్ షో 'ది స్విచ్’లో నిర్వహించిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో వైభవ్ సూర్యవంశీ మాట్లాడాడు.
వైభవ్ తన అంతిమ లక్ష్యం టీ20లో 200 పరుగులు చేయడమేనని వెల్లడించాడు. "టీ20లో 200 పరుగులు చేయాలనుకుంటున్నాను" అని పీటర్సన్తో చెప్పాడు. 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున క్రిస్ గేల్ 175 పరుగులు చేసి అత్యధిక టీ20 స్కోరును నెలకొల్పాడు. ఈ రికార్డును అధిగమించడమే తన లక్ష్యమని వైభవ్ పేర్కొన్నాడు. ఏ మ్యాచ్లో అయినా తాను 20 ఓవర్లు బ్యాటింగ్ చేస్తే, ఆ రికార్డును కచ్చితంగా బద్దలు కొడతానని తేల్చి చెప్పాడు.
టీ20 క్రికెట్లో వైభవ్ సూర్యవంశీకి అత్యధిక స్కోరు 144 పరుగులు. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్పై 175 పరుగుల మ్యాచ్-విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి సత్తా చాటాడు. అలాగే యూత్ వన్డే క్రికెట్లో వేగవంతమైన సెంచరీ (ఇంగ్లాండ్పై 52 బంతుల్లో 100 పరుగులు) రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.












Click it and Unblock the Notifications