లవ్లీ మూమెంట్: హైదరాబాద్ చిన్నారులతో పాకిస్తాన్ కేప్టెన్ బాబర్ ఆజమ్ ముచ్చట్లు
హైదరాబాద్: వరల్డ్ కప్ 2023లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో పాకిస్తాన్ తన రెండో మ్యాచ్ ఆడుతోంది. శ్రీలంక జట్టుతో తలపడుతోంది. వరుసగా రెండో మ్యాచ్లో విజయదుందుభి మోగించడానికి ఉవ్విళ్లూరుతోంది బాబర్ ఆజమ్ సేన. దీనికి అనుగుణంగా వ్యూహాలను ఎగ్జిక్యూట్ చేస్తోంది.
ఇదే హైదరాబాద్ ఉప్పల్ పిచ్పై ఇదివరకు నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ విజయ కేతనాన్ని ఎగురవేసిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 286 పరుగులు చేసింది. 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు తడబడింది. 41 ఓవర్లల్లో 205 పరుగులకు ఆలౌట్ అయింది.

పాకిస్తాన్ బౌలర్ల సత్తాకు అద్దం పట్టిన మ్యాచ్ అది. హ్యారిస్ రవూఫ్ అదరగొట్టాడు. మూడు వికెట్లతో సత్తా చాటాడు. హసన్ అలీ-2 వికెట్లు కూల్చాడు. షహీన్ షా అఫ్రిది, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాదబ్ ఖాన్ ఒక్కో వికెట్ను తీసుకున్నారు. బౌలర్లందరూ వికెట్లను తీసుకున్నారా మ్యాచ్లో.
ఇప్పుడు శ్రీలంకను ఢీ కొడుతోంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది శ్రీలంక. ఇన్నింగ్ ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. రెండో ఓవర్లోనే ఓపెనర్ కుశాల్ పెరీరా డకౌట్ అయ్యాడు. హసన్ అలీ బౌలింగ్లో వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆఫ్ స్టంప్కు కాస్త దూరంగా పడిన షార్ట్ లెంగ్త్ బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయాడు పెరీరా.
బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న ఆ బంతి నేరుగా కీపర్ రిజ్వాన్ చేతుల్లో వాలింది. పెరీరా రూపంలో అయిదు పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది లంక. ఆ తరువాత గేరు మార్చింది. దూకుడు పెంచింది. ధాటిగా ఆడుతోంది. ఓవర్కు ఆరు పరుగులు చొప్పున పిండుకుంటోంది లంక. మరో ఓపెనర్ పాథుమ్ నిశ్శంక- 44, వన్ డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్- 29 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.
కాగా- మ్యాచ్ ఆరంభానికి ముందు ఓ సన్నివేశం అందర్నీ ఆకట్టుకుంది. కొందరు చిన్నారులతో పాకిస్తాన్ కేప్టెన్ బాబర్ ఆజమ్ ముచ్చట్లు పెట్టాడు. వారిని ఆప్యాయంగా పలకరించడం కనిపించింది. వరుసగా గ్రౌండ్లోకి వచ్చిన ఆ చిన్నారులను బాబర్ నవ్వుతూ పలకరించాడు. వారితో కలిసి ఫొటోలు దిగాడు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.












Click it and Unblock the Notifications