ఉప్పల్ స్టేడియంలో అదరగొడుతున్న పాక్- టీమిండియాకు డేంజర్ బెల్స్
ఇస్లామాబాద్: ఈ ఏడాది ఆసియా కప్ ఛాంపియన్గా నిలిచిన భారత జట్టు ముందు బిగ్గెస్ట్ టాస్క్. ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్లో ఆడాల్సి ఉంది. అక్టోబర్ 8వ తేదీన టీమిండియా తన తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. 11వ తేదీన రెండో మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ను ఢీ కొడుతుంది.
ఆ తరువాత జరిగే గేమ్లో అంటే.. తన మూడో మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఎదుర్కోనుంది రోహిత్ సేన. ఈ మ్యాచ్కు గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. దీని తరువాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్లతో తలపడుతుంది.

నెదర్లాండ్స్తో భారత్ ఆడబోయే మ్యాచ్.. లీగ్ దశలో చిట్ట చివరిది. నవంబర్ 12వ తేదీన ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. ఆ తరువాత నవంబర్ 15, 16 తేదీల్లో సెమీ ఫైనల్స్ ఉంటాయి. 19వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఫైనల్ కూడా నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యాన్ని ఇవ్వనుంది.
వరల్డ్ కప్లో భాగంగా ఇవ్వాళ వామప్ మ్యాచ్లు ఆరంభం అయ్యాయి. గువాహటిలో శ్రీలంక- బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. తిరువనంతపురంలో ఆఫ్ఘనిస్తాన్- దక్షిణాఫ్రికా మధ్య వామప్ మ్యాచ్ జరగాల్సి ఉన్నప్పటికీ.. భారీ వర్షం వల్ల ఒక్క బంతి కూడా పడకుండానే అది రద్దయింది.
మరో మ్యాచ్లో పాకిస్తాన్- న్యూజిలాండ్ తలపడుతున్నాయి. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం దీనికి వేదిక అయింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ అదరగొడుతోంది. ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ.. జట్టు కేప్టెన్ బాబర్ ఆజమ్, వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్.. క్రీజ్లో పాతుకుపోయారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.
ఓపెనర్లు అబ్దుల్ షఫిక్- 14, ఇమాముల్ హక్- 1 పరుగుకే అవుట్ అయ్యారు. మిఛెల్ శాంట్నర్, మాట్ హెన్రీ.. వారిద్దరినీ పెవిలియన్ దారి పట్టించారు. తొలి వికెట్ ఆరు పరుగులకు, రెండో వికెట్ 46 పరుగులకు పడ్డాయి. మరో వికెట్ పడగొట్టడానికి న్యూజిలాండ్ బౌలర్లు చెమటోడ్చాల్సి వచ్చింది.
మూడో వికెట్ భాగస్వామ్యానికి 114 పరుగులు జోడించిన తరువాత బాబర్ ఆజమ్ అవుట్ అయ్యాడు. జట్టు స్కోరు 160 పరుగుల వద్ద ఉన్నప్పుడు శాంట్నర్ బౌలింగ్లో మిఛెలకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 84 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, రెండు భారీ సిక్సర్లతో 80 పరుగులు చేశాడు బాబర్. రిజ్వాన్-62, సవూద్ షకీల్- 4 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.
ఆసియా కప్ సూపర్ 4లో అధ్వాన్నంగా ఆడి కనీసం ఫైనల్స్కు కూడా చేరలేకపోయిన పాకిస్తాన్.. వామప్స్లో ఫామ్లోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అక్టోబర్ 14వ తేదీన పాక్తో తలపడాల్సి ఉంది టీమిండియాకు. వామప్స్లో భారత జట్టు శనివారం గువాహటిలో ఇంగ్లాండ్తో తలపడనుంది.












Click it and Unblock the Notifications