బాబాకు లోటస్ కారు
హైదరాబాద్: పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా తన 75వ జన్మ దినోత్సవం రోజు ప్రత్యేకంగా రూపొందించిన పద్మాకారం కారులో భక్తులకు దర్శనమివ్వబోతున్నారు. వివిధ డిజైన్లలో మీనియేచర్ కార్లను తయారు చేస్తున్న కె. సుధాకర్ యాదవ్ ఈ కారును సత్యసాయిబాబా కోసం ప్రత్యేకంగా తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ కారు కోసం కొద్ది నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) హెచ్. జె. దొర ఆర్డర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. దొర సత్యసాయిబాబా భక్తుడనే విషయం అందరికీ తెలిసిందే.
సత్యసాయిబాబా సుధాకర్ కార్ల తయారీలో కనబరిచిన సృజనాత్మకత పట్ల ముగ్ధుడై తన కోసం రెండు రకాల కార్లను తయారు చేయాల్సిందిగా అడిగినట్లు తెలుస్తోందని ఒక ఆంగ్ల దిన పత్రిక రాసింది. ఒకటి- కమలం ఆకారంలోని కారు కాగా రెండోది శివలింగం అకారంలోని కారు. పద్మం దైవత్వానికి, సంపదకు ప్రతీక. ఈ కారులో తిరుగుతూ బాబా తన జన్మ దినం రోజు భక్తులకు దర్శనమిస్తారు. శివలింగం కారును బాబా తన విశిష్ట భక్తుల కోసం ఉద్దేశించినట్లు చెబుతున్నారు.
లోటస్ కారు తయారీకి సుధాకర్ మూడు నెలలు తీసుకున్నాడు. ఈ రెండు కార్ల ఖరీదు గురించి మాట్లాడడానికి సుధాకర్ ఇష్టపడడం లేదట. అంతేకాదు, ఫొటోలు కూడా తీసుకోనీయలేదని ఆంగ్ల దిన పత్రిక రాసింది. తాను కార్లను తయారు చేసి పంపాననే మాట తప్ప సుధాకర్ మరో మాట చెప్పడం లేదట.
బాబా జన్మదినం ఈ నెల 23వ తేదీన పుట్టపర్తిలో పెద్ద యెత్తున జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రధానితో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు, పారిశ్రామికవేత్తలు ఎంతో మంది వస్తారు. దేశ,విదేశీ ప్రముఖులెందరో ఆయన దర్శనం కోసం రావడం మామూలే.
గత సంచికలో