కెసిఆర్ గెలుస్తారా? వైఎస్ నిలుస్తారా?
హైదరాబాద్: ఎన్నారై వరుల మోజులో పడి మోసపోతున్న ఆంధ్రప్రదేశ్ యువతుల సంఖ్య ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వ ప్రవాస భారతీయ వ్యవహారాల విభాగం తాజా నివేదికలో పేర్కొంది. విదేశాల్లో స్ధిరపడిన ప్రవాసాంధ్ర యువకులను పెళ్ళి చేసుకున్న 67 మంది యువతులు రాష్ట్రంలో న్యాయపోరాటం చేస్తున్నారు. ఇవి యువతులు ధైర్యంగా ముందుకు వచ్చి పోరాటాలు చేస్తున్న కేసులు మాత్రమేనని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే పెళ్ళిళ్ళు పూర్తిగా చెడిపోయి ఇంకా నష్టపోతామన్న భయంతో ఎంతో మంది యువతులు బయటపడడం లేదని కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్ర సిఐడి విమెన్ ప్రొటక్షెన్ సెల్ 11 ఎన్ఆర్ఐ కేసులను దర్యాప్తు చేస్తోంది. ఇందులో మూడు కేసుల్లో నిందితులైన ఎన్నారైలను అరెస్టు చేసేందుకు రాష్ట్ర పోలీసు శాఖ ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేసినట్టు సిఐడి అధికార వర్గాలు వెల్లడించాయి. ఎన్నారై పెళ్ళిలలో క్లాసిక్ కేసు వివి రాజు- అరుణలది. అరుణ తలిదండ్రులు లక్షలాది రూపాయలు కట్న కానుకలు ఇచ్చి రాజుతో పెళ్ళి జరిపించారు. వీరికి ఇద్దరు కొడుకులు పుట్టారు. అమెరికాలో డాలర్లు సంపాదిస్తున్నా విరాజు ఇంకా డబ్బు కావాలంటూ అరుణను మానసికంగా శారీరకంగా హింసించసాగాడు. అమెరికాలోనే మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకుని అరుణను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు. ఆమె దిక్కులేని పరిస్ధితుల్లో ఆంధ్రప్రదేశ్కు తిరిగి వచ్చి న్యాయం కోసం పోరాడుతోంది. గత ఏడాది సెప్టెంబర్ 8న సిఐడి పోలీసులు ఇంటర్పోల్ ద్వారా రాజుకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు.
డాక్టర్ దీపికది మరో విషాద గాధ. ఆమె ఎండి చదివింది. డెంటల్ సర్జన్ అరవింద్తో ఆమె అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంది. వీరికి ఒక కొడుకు పుట్టాడు. దీపిక తలిదండ్రులు పెళ్ళి సమయంలో భారీ కట్నమే ఇచ్చారు. ఆ తర్వాత అరవింద్ పై చదువుల కోసం అమెరికా వెళ్ళాడు. భర్త అమెరికాలో... దీపిక ఇక్కడ అత్తమామల వద్ద. అత్త మామలు ఆమెను మరో 70 లక్షల అదనపు కట్నం తెమ్మని సతాయించసాగారు. దీపిక ఫిర్యాదును గత ఏడాది జూన్లో పోలీసులు నమోదు చేసుకున్నారు. అనంతపురం పట్టణానికి చెందిన పద్మది కూడా ఇదే డాలర్ డ్రీమ్స్ కేసు. ఆమె తండ్రి వెంకటరెడ్డి పద్మను అమెరికాలో స్ధిరపడిన ప్రభాకర్కు ఇచ్చి పెళ్ళి చేశాడు. పద్మ కూడా భర్తతో ఫ్లోరిడాలో స్ధిరపడి ఉద్యోగం చేస్తోంది. ఇంకా కట్నం కావాలని ప్రభాకర్ భార్యను వేధించసాగాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమెను ఇంట్లో నుంచి గెంటి వేయడంతో ఆమె ఫ్లోరిడా కోర్టులో భర్తపై న్యాయ పోరాటం చేస్తోంది.
ఇవి కొన్ని కేసులు మాత్రమే. ఇంకా ఎన్నో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. 1999లో సిఐడి వద్ద నమోదైన కేసుల్లో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినా ఉభయ దేశాల చట్టాల్లో ఉన్న తేడాల వల్ల నిందితులకు ఇప్పటివరకు శిక్షలు పడలేదు. బాగా చదువుకున్న యువతులు కూడా వరకట్న దాహానికి సమిధలవుతున్నారు. దీనిపై భారత ప్రభుత్వం ప్రత్యేక చట్టం తేవలసి ఉంది.