సంతానలేమితో ఆస్పత్రికి వెళ్ళిన యువకుడిలో గర్భాశయం.. ప్రపంచంలోనే అరుదైన కేసు!
సహజంగా ఆడవారిలో గర్భాశయం ఉంటుంది. ఆడవారికి మాత్రమే సంతానోత్పత్తి సాధ్యం అవుతుంది. కానీ మగవారిలో కూడా గర్భాశయం ఉండటం మీరు ఎప్పుడైనా విన్నారా? వినటానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నమ్మలేని నిజం. ఇప్పటివరకు వినకపోతే ఢిల్లీలో ఒక అరుదైన కేసు గురించి తప్పక తెలుసుకోవాల్సిందే.
ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో వైద్యులను ఆశ్చర్యానికి గురిచేసిన అరుదైన కేసు వెలుగులోకి వచ్చింది. 26 ఏళ్ల యువకుడు సంతానలేమి సమస్యతో రాజౌరీ గార్డెన్లోని ఆర్జి హాస్పిటల్స్కు వచ్చాడు. పరీక్షల్లో అతని వీర్యంలో శుక్రకణాలు లేకపోవడం అజూస్పెర్మియా అనే స్థితిగా ఆయన ఆరోగ్య స్థితిని గుర్తించారు. అతనికి సంబంధించిన రెండు వృషణాలు కూడా కిందికి దిగకుండా పొత్తికడుపులోనే ఉండిపోయాయని తేలింది.

మరిన్ని పరీక్షల్లో ఎంఆర్ఐ స్కాన్ చేయగా కటివలయంలో గర్భాశయం లాంటి చిన్న నిర్మాణం, ఫెలోపియన్ ట్యూబ్లను పోలిన నిర్మాణాలు కనిపించాయి. జన్యు పరీక్షలో 46, XY క్రోమోజోమ్ నమూనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది పురుష క్రోమోజోమ్లు ఉన్నప్పటికీ స్త్రీ అవయవాలు అభివృద్ధి చెందే 'పెర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్' (PMDS) అనే అరుదైన పుట్టుకతో వచ్చే పరిస్థితి అతనికి ఉందని వైద్యులు గుర్తించారు.
అయితే ఈ అరుదైన సమస్య ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 300 కంటే తక్కువ కేసులు మాత్రమే నమోదయ్యాయి. వైద్యులు లాపరోస్కోపిక్ ఆపరేషన్ చేసి అభివృద్ధి చెందని గర్భాశయం, సంబంధిత నిర్మాణాలు తొలగించారు. క్రిందికి రాకుండా పొత్తికడుపులోనే వృషణాలు ఉండటం కారణంగా, అవి పాడైపోయి, క్యాన్సర్ లక్షణాలు బయట పడటంతో వృషణాలను తొలగించారు.
వృషణాల్లో క్యాన్సర్ లక్షణాలు కనిపించడంతో చాలా రిస్క్ చేసి వాటిని తొలగించాల్సి వచ్చిందని వైద్యులు చెప్పారు. ఆస్పత్రి చీఫ్ యూరాలజిస్ట్ డాక్టర్ సుశీల్ ఖర్బందా మాట్లాడుతూ, ఇది అసాధారణమైన కేసు అని, యుక్తవయస్సు వచ్చే వరకు బయటపడని సమస్య ఇదని పేర్కొన్నారు. అతనికి చేసిన గర్భాశయ తొలగింపు, వృషణాల తొలగింపు శస్త్ర చికిత్స విజయవంతం అయ్యిందని ఢిల్లీ ఆర్జీ హాస్పిటల్స్ వైద్యులు వెల్లడించారు.













Click it and Unblock the Notifications
