చూసి వెళ్తారా? ఓటేస్తారా?

చిరంజీవిని ఒకసారైనా ప్రత్యక్షంగా చూడాలని జనం వస్తున్నారే తప్ప, వారంతా ఆయన పార్టీకి ఓటు వేస్తారన్న గ్యారంటీ లేదన్నది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న వాదన. చిరంజీవి ప్రత్యర్ధి పార్టీలు ఈ వాదనను బలంగా వినిపిస్తుండగా ప్రజారాజ్యం మేధావులు కూడా దీనిపై దృష్టి సారించారు. ఈ వాదనను చిరంజీవి స్వయంగా ఖండించారు. కానీ ప్రజారాజ్యం సీనియర్ నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య ఇటీవల చిరంజీవికి రాసిన లేఖలోని ప్రధానాంశం ఇదే.
జోగయ్య చిరంజీవికి నిర్మొహమాటంగా రాసిన లేఖ సంచలనం సృష్టించింది. ప్రజారాజ్యం తన సొంత పార్టీ అని, చిరంజీవి తన కొడుకు వంటి వాడని అటువంటప్పుడు తాను పార్టీ అధినేతను ఎందుకు విమర్శిస్తానని నిన్న జోగయ్య టీవీ చానళ్ళకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో చెప్పారు. నేడు ఆ ప్రధాన పత్రిక ఆయన స్వదస్తూరీతో రాసిన లేఖను ప్రచురించడంతో ఆయన టీవీ చానళ్ళకి అందుబాటులో లేకుండా తప్పుకున్నట్టు కనిపిస్తోంది. జోగయ్య లేఖ ప్రభావం ప్రజారాజ్యం కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ పెద్దగా ఉండే అవకాశం లేదు. అయినా కాంగ్రెస్ అధికార పత్రిక దీనిని పెద్ద చర్చనీయాంశం చేసింది.
తండ్రి వంటి జోగయ్య మీద నిజంగా చిరంజీవి ఆగ్రహంగా ఉన్నారా? జోగయ్య మీద ద్వేషం ఉన్న ప్రజాపార్టీలోని ఇతర అగ్ర నాయకుల ప్రతిస్పందనలు ఏమిటి? ఇవ్వన్నీ అప్రధానమైనవే. అల్లు అరవింద్ ఈ అంశంపై ఎలా స్పందిస్తున్నారన్నదే ముఖ్యం. ఎందుకంటే కుటుంబ మిత్రుడైన జోగయ్య విషయంలో ఎలా వ్యవహరించాలో అంతిమ నిర్ణయం తీసుకునేది అల్లు అరవిందే. జోగయ్య కాంగ్రెస్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారా అన్న దిశగా ప్రజారాజ్యం మేధావులు అధ్యయనం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని ప్రకటించిన జోగయ్యకు చిరంజీవి ఏ చర్య తీసుకున్నా ఊడేదేమీ ఉండదు, ఆయన పళ్ళు వయోభారం వల్ల ఇప్పటికే చాలా వరకు ఊడిపోయాయి. అయితే ప్రజారాజ్యం సంస్ధాగత వ్యవహారాలు బాగుండలేదన్న జోగయ్య వ్యాఖ్యలు చాలా వరకు నిజంగానే కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications