చిరు పార్టీలో మెగా గౌడ్!

ఒకప్పుడు దేవేందర్ గౌడ్ ప్రజారాజ్యం అధినేత చిరంజీవిని కలవాలంటే గంటసేపు వేచి ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు చిరంజీవే ఆయనను గంటల తరబడి వదలడం లేదు. చిన్న విషయమైనా..పెద్ద విషయమైనా చిరంజీవికి మొదట గుర్తుకొచ్చేది ఆయనే. ఉదయం ఐదు గంటల నుంచి అర్ధరాత్రి 11 గంటల మధ్య ఎప్పుడైనా, ఏ సమస్య ఎదురైనా చిరంజీవి ఫోన్చేసేది ఆయనకే. ఆయనే దేవేందర్గౌడ్...ఎన్టీపీని పీఆర్పీలో విలీనం చేయడానికి ఒకప్పుడు చిరంజీవి ఇంటివద్ద దేవేందర్గౌడ్ పడిగాపులు కాశారు. ఇప్పుడు అదే దేవేందర్గౌడ్ పార్టీకి అంతా తానే అయ్యారు.
దీనికి పలు కారణాలు కనిపిస్తున్నా ప్రధాన కారణం మాత్రం...గౌడ్ పార్టీని వీడబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారమే అన్నది ఇతర నేతల వాదన. కేఎస్సార్ మూర్తి, శివశంకర్, వినయ్, మిత్రా..ఇలా ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోతున్న నేపథ్యంలో గౌడ్ కీలకంగా మారారు. నిజానికి ఇప్పుడు చిరంజీవి పక్కన మిగిలిన సీనియర్ నేతలు ఇద్దరే. అందులో ఒకరు సి రామచంద్రయ్య కాగా, మరోనేత దేవేందర్గౌడ్. ఆయన మళ్లీ సొంతపార్టీ టీడీపీలోకి వెళ్లిపోతారనే ప్రచారం జరుగుతోంది. గౌడ్ కూడా అందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.
దీంతో చిరంజీవి మేలుకున్నట్టు తెలుస్తోంది. గౌడ్ జారిపోకుండా 'ప్రాధాన్యం' మంత్రం జపిస్తున్నట్టు సమాచారం. కొద్దిరోజుల క్రితం నగర కన్వీనర్ ఎంపిక విషయంలో సైతం గౌడ్ సిఫార్సు చెల్లుబాటు కాలేదు. ఆయన కనకారెడ్డి పేరు ప్రతిపాదించగా అధిష్ఠానం మాత్రం కట్టెల శ్రీనివాస్ యాదవ్ వైపు మొగ్గుచూపింది. దీంతో కనకారెడ్డి టీడీపీలో చేరిపోయారు. గౌడ్ కూడా 'స్వగృహా'నికి వెళ్లబోతున్నారన్న ప్రచారంతో సీన్ మారినట్టు సమాచారం.
తాజాగా గౌడ్కు బాగా ప్రాధాన్యం ఇస్తున్నట్టు పార్టీవర్గాల కథనం. ఏ సమస్య వచ్చినా చిరంజీవికి గౌడే గుర్తొస్తున్నారని చెబుతున్నారు. రెండురోజుల క్రితం సాయంత్రం ఐదు గంటలకు గౌడ్ను ఇంటికి పిలిపించుకున్న చిరంజీవి ఆయనతో రాత్రి 11 గంటల వరకు ఏకధాటిగా భేటీ అయ్యారంటేనే పరిస్థితి అర్ధమవుతుంది. పార్టీని వీడొద్దని, పార్టీ పునర్నిర్మాణంలో కీలకపాత్ర పోషించాలని కూడా చిరంజీవి గౌడ్ను కోరినట్టు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications