ఆషాఢం అల్లుడు కెసీఅర్
ఆషాఢ మాసంలో అన్నీ అడ్డంకులే ఎదురవుతాయని, స్థల మార్పిడి జరిగితే సర్దుకుంటుందని ఒక పండితుడు చెప్పటంతో కరీంనగర్లో మకాం వేసిన కెసిఆర్ ప్రస్తుతం ఉత్తర తెలంగాణ జిల్లాల నాయకులతో సంప్రదింపులలో నిమగ్నమై ఉన్నారు. ఆ విధంగా పార్టీకి కాస్తో కూస్తో పట్టు ఉన్న ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి పేరున్న నేతలు ఎవరూ అసమ్మతి వెైపు తొంగి చూడకుండా కెసిఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విశ్వసనీయ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం ఆషాఢమాసం ముగిసే దాకా కెసిఆర్ మౌనాన్నే ఆశ్రయించనున్నారు. అంటే సుమారు మరో 12 రోజుల పాటు ఆయన బహిరంగంగా ఎవరితోనూ మాట్లాడే అవకాశం లేదు. శ్రావణమాసం ప్రారంభమైన తర్వాత తిరిగి చురుకుగా పార్టీ కార్యకలాపాలలో పాల్గొంటే శుభం కలుగుతుందని పండితులు చెప్పిన మాటను కెసిఆర్ పాటించనున్నట్టు పార్టీ వర్గాలు వివరించాయి.
తెలంగాణ భవన్ పక్కనే ఇటీవల నిర్మించిన జగన్నాథ స్వామి ఆలయం గోపురం నీడలు కార్యాలయంపై పడుతుండటంతో చికాకులు తలెత్తుతు న్నాయని వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలపై సైతం కెసిఆర్ దృష్టి సారించినట్టు సమాచారం. ఇప్పటికే కొందరితో ఆయన ఈ విషయం మాట్లాడినట్టు తెలిసింది. ఈ దోషం నివారణకు ఏమిచేయాలో పెద్దలను అడిగి శ్రావణమాసంలో జరిపించనున్న ట్టు ఒకరిద్దరు నేతలు తెలిపారు.
మరోవైపు తనకు సన్నిహితులెైన వారే పార్టీని వీడి పోనున్నట్టు టీవీలలో వస్తున్న వార్తలపట్ల కెసిఆర్ ఆరా తీస్తున్నారు. సికిందరాబాద్ మాజీ ఎమ్మెల్యే టి.పద్మారావు తాను టిడిపిలో చేరుతున్నట్టు వచ్చిన వార్తలను ఖండించి 24 గంటలు అయినా గడవక ముందే మరో సీనియర్ నేత జగదీశ్ తాను సైతం పార్టీని వీడటం లేదని ప్రకటించి కొద్దిలో కొద్దిగా ఊరట కల్గించారు. ఈ వార్తలన్నీ ఎప్పటికప్పుడు కెసిఆర్కు అందుతూనే ఉన్నాయని, ఆయన అందరితోనూ మాట్లాడుతు న్నారని సీనియర్లు అంటున్నారు. అయితే కెసిఆర్ వెనక్కి వస్తారా లేక ఆషాఢం ముగిసే దాకా అక్కడే మకాం వేస్తారా అనేది వారు చెప్పలేకపోతున్నారు.